Saturday, March 12, 2011

తెహ్రీర్ నుంచి తెహ్రీర్ కు మళ్ళీ మళ్ళీ..

- ఒసామా హిజ్జి..


స్క్వేర్ ను చూసావా..

ప్రజలు ఎలా నిలబడ్డారో చూసావా..

జరిగింది మర్చిపోడానికి రక్తం ఎలా నిరాకరిస్తుందో చూసావా..

మతాలు ఒక్కటయ్యి..

ముస్లింలు.. క్రైస్తవులు కలిసి ప్రార్ధించడం చూసావా..

నియంతలపై విప్లవిస్తున్న చోట

నీకు శిలువలు కనబడవు..

నెలవంకలూ కనబడవు..

పూజారులు.. షేకుల నాటకీయ కౌగిలింతలూ కనబడవు..

మాతృభూమి కోసం ఏకమౌతున్న ఆత్మలు కనబడతాయి..

సమున్నతంగా ఎగురుతున్న పతాకాలు కనబడతాయి..

ఒకే దైవం.. ఒకే రక్తం.. ఒకే అస్థత్వాన్ని నమ్మే ఇద్దరు ఈజిప్షియన్లను చూస్తావు..

తిరుగుబాటును విశ్వాసంలో భాగంగా చూస్తావు..

మతమంటే విధేయంగా ఉండడం మాత్రమే కాదని చూస్తావు..

విప్లవం ఈజిప్ట్ వాసులను వీరులుగా తీర్చిదిద్దడం చూస్తావు..

భయం.. బందిపోట్లు.. భయపడడాన్ని చూస్తావు..

సల్లీ జహ్రాన్ కలలు గన్న ఈజిప్ట్ ను చూస్తావు..



(సల్లి నిరసన తెలపడానికి తెహ్రీర్ వెళుతుండగా సైన్యం చేసిన దాడిలో తలకు గాయమై మరణించింది. ఇది కవిత కాదు. బాధతో స్రవిస్తూ గుండెను పిండేస్తున్న పదాలు. ఈ పదాలు సల్లీ జహ్రాన్ ఆత్మకోసం అర్పిస్తున్న కానుక. మా దేహాల్లో ప్రాణమున్నంత వరకూ మాకు శాంతి లేదు. విశ్రాంతి లేదు. - ఒసామా హిజ్జి..)

(స్వేచ్ఛానువాదం: శక్తి)


Friday, March 11, 2011

తప్పు ఎవరిది? ఎందుకు జరిగింది?

అనుకున్నంతా.. ఆందోళన చెందినంతా జరిగింది. నిజమే ట్యాంక్ బండ్‌పై జరిగిన ఘటనలు దురదృష్టకరం. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలు హర్షించదగినవి కావు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమానికి ఉన్న పవిత్రతను ప్రశ్నించే అవకాశం ఈ ఘటన. నలుగురిలో నవ్వుతున్న సీమాంధ్రులకు తెలంగాణ ఉద్యమంపై దూషణలు చేయడానికి తగిన ఆయుధం కల్పించిన పరిస్థితి.

కానీ.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర చరిత్రలో.. భారతవనిలో మునుపెన్నడూ జరగని దురదృష్టకర ఘటననా? ఈ ప్రజాస్వామ్యంలో దాడులు మునుపెన్నడూ జరగనివా? నిజంగా మిలియన్ మార్చ్‌లో ఆందోళకారులు అంతటి పాపానికి ఒడిగట్టారా? .. ఈ ప్రశ్నలు అడగడంతో నేను దాడులను సమర్థిస్తున్నానని కాదు.. ముందే ఒక అభిప్రాయంలో ఉన్నవారికి ఎంతటి విశ్లేషణ ఇచ్చినా నిష్ప్రయోజనం కదా..

ఈ ఘటన జరగడానికి టీఆర్‌ఎస్‌లోని ఓ వర్గం మంకుతనమే కావొచ్చు. తమ మాటను లెక్కచేయకుండా మార్చ్ నిర్వహించడం.. వారి అహం దెబ్బతినొచ్చు. మేము లేకపోతే ఉద్యమం నడిపించలేరనే అభిప్రాయం కల్పించాలనుకున్నారేమో.. దాడుల పల్లవితో విమర్శలు చేస్తోన్న గద్దర్‌ను మార్చ్‌లో లాగడం ద్వారా రెండు పిట్టలు కొట్టాలనుకున్నా టీఆర్‌ఎస్‌లోని ఓ వర్గం సక్సెస్ అయిందని నా అనుమానం. ఇది నిజం కావొచ్చు.. కాకపోవచ్చు..

మొత్తం ఘటనకు దోషులు ప్రభుత్వం, రాజకీయ పార్టీలే.. ప్రజాస్వామ్యం, దారుణం అంటూ ఘోషించేవారు కాస్తా వెనుదిరిగి చూస్తే ఎంతో కొంత వాస్తవం తెలుస్తుంది. ప్రభుత్వం కాబట్టి ఏమైనా చేయొచ్చు.. ఉద్యమకారులు అలా చేయొద్దు అనుకునే ఆలోచనలో ఉన్నవారు.. కొద్దిగానైనా ప్రజాస్వామ్యం గురించి తెలుసుకుంటారు.

ఒకప్పుడు అన్నల సానూభూతి పరులనే నెపంతో ఎంతటి చిత్రహింసలకు గురిచేసేవారో.. ప్రస్తుతం తెలంగాణలో ప్రజలు పోలీసుల హింసకు బలైతున్నారు. వారి ఆంక్షలకు మనో వేదన చెందుతున్నారు. సమస్యను పరిష్కరిచాలనో, అర్థం చేసుకుందామనో అభిప్రాయం లేని ప్రభుత్వాలు పోలీసులకు అధికారాలను అప్పచెబుతాయి. విగ్రహాలపై దాడులు దారుణమంటున్న అధికార, ప్రతిపక్ష సీమాంధ్ర నేతలకు.. ఒక్కడ్ని చేసి పదిమంది పోలీసులు విద్యార్థిని చితకబాదిన సంఘటనలు వారి కళ్లకు కనపడలేదా.. వారి ఆక్రంధనలు చెవికి ఎక్కలేదా.. చరిత్ర అంటే పుస్తకాల్లో, కట్టడాలపై నిక్షిప్తం చేసుకున్న ఉదహరణలు కావు.. చరిత్ర అంటే ప్రజలే... వర్తమాన ప్రజలు ముఖ్యం కానప్పుడు.. గత చరిత్ర ఎందుకు? చరిత్రను మోసేది.. మోసుకేళ్లేది ప్రజలే... ఆ ప్రజలే ఆకాంక్షల ముందు.. చరిత్ర ఎక్కువనుకుంటే ఆ చరిత్రను బహిష్కరించగలరు... ధ్వంసం చేయగలరు.. తెలంగాణ ఉద్యమానికి కారణాల్లో ఒకటి చరిత్ర-సంస్కృతిపై దాడులు.. తమ సంస్కృతిపై అవహేళన, చరిత్రపై విధ్వంసాన్ని జీర్ణించుకోలేక కుమిలిపోతున్న పరిస్థితి కొనసాగుతూనే ఉంది. దానిపై ఎన్నడూ మాట్లాడని వారికి ఇప్పుడు చరిత్రపై దాడులు గురించి ప్రశ్నించే అర్హత లేదని ఆక్రోశం ఇప్పుడు ఉంది. అది విగ్రహాల తప్పు కాదు. కాని విగ్రహాలకు ప్రతినిధుల తప్పే కదా.. ట్యాంక్ బండ్‌పై తమ ప్రాంత మహానుభావుల్లో కొందరివే ఉన్నాయే ప్రశ్నకు ఇప్పటికీ ప్రభుత్వం నుంచి సమాధానం లేదు, ఆ ప్రశ్నలు తిరిగి రాకుండా చర్యలు చేపట్టలేదు. ఇప్పటి ఘటన జరిగేందుకు కారణాల్లో ఇది ఒకటి కాదా?. రాజకీయ సమస్యను ప్రజల సమస్యగా మారేలా ముసుగు తన్ని పడుకున్న ప్రభుత్వాలది కాదా?. నిజానికి విగ్రహాలు ధ్వంసం చేసిన వారు.. కావాలని చేసిన దుండగులు కావొచ్చు.. ఆవేదనతో చేసిన తెలంగాణ వాదులు కావొచ్చు.. ఒకటి మాత్రం స్పష్టం... వారిని ఇందుకు పురిగొల్పిన పరిస్థితులు సృష్టించిన ప్రభుత్వాలది, విధాన నిర్ణయాలు తీసుకోలేని పార్టీల నేతలే అసలు దోషులు. విగ్రహాలపై దాడులు చేసిన వారికి త్రిపురనేని ఏ సేవ చేశాడో తెలియదు, ఎర్రాప్రగడ ఏ పర్వం రాశాడో తెలియదు, శ్రీకృష్ణదేవరాయల అష్టదిగ్గజాలెవరో తెలియదు. కానీ ప్రభుత్వాలు, పార్టీలు ఇప్పటి పరిస్థితులు ఊహించక పోవడం క్షమించరాని నేరం. అసలీ విషయాలు తెలిసీ తెలియనట్టుగా ప్రవర్తించడమే దారుణం.

తరుచూ నేతలపై దాడులు జరుగుతుండడం ప్రజల్లో ఉన్న ఆగ్రహవేశాలేనని నిజం తెలసుకున్న ప్రజా ప్రతినిధులు ఆ దాడులు మరో ప్రాంతంపై జరగకుండా నివారించే ఆలోచనలు చేయగలుగుతున్నారా? తాము ఎన్నుకున్న నేతలు తమ అభిప్రాయలకనుగుణంగా లేకపోవడం దాడులకు పురిగొల్పేలా చేస్తున్నాయి.

మీడియాపై దాడి... అప్రజాస్వామికం, విద్రోహం అనే వారు.. అదే మీడియాపై ప్రభుత్వం దాడులు చేస్తే ఏం చేశారు? అ సంఘాలు ఏం చేశాయి? గిరిగీసుకుని వార్తలు ప్రసారం చేస్తున్న సంస్థలకు నైతికత గురించి అర్హత ఉందా? పైకి మంచి ముసుగు వేసుకుని వెనకాల రాజకీయ నేతలతో ములఖత్ అవుతోన్న మీడియాకు.. ఆనేతలకు తేడా ఏముంది? తమ అభిప్రాయాలు, ఆక్రంధనలు ప్రసారం చేయలేని మీడియా ఆగ్రహాలను మాత్రమే చూపించడంపై ఆందోళనకారులు తమ ప్రతాపం చూపారు. పరికరాలు పోయాయని పెడబొబ్బలు పెట్టడం.. గొరంతను కొండంత చేస్తున్న మీడియాకు అలాంటి పరికరాలు పొందడం పెద్ద సమస్యా?. మీడియా నిష్పక్షపాతంగా లేకపోవడమే వారికి కష్టాలు తెచ్చిపెడుతోంది. మీడియాను ప్రజలు ఎంతో కొంత ఆదరిస్తున్నారంటే.. మీడియా వల్లే తమకేదో ఇంకా మంచి జరుగుందనే.. కానీ ఆ మంచి జరగదని తెలిస్తే మీడియాకు ఆ విలువ ఉండదు.. వారిపై ఇలాంటి దాడులు ఆగవు. అందుకు తప్పు పట్టాల్సింది ఎవరిని?

ఎన్నైనా చెప్పు చేసింది తప్పు కాదా.. అంటే తప్పు కాదని ఎవరూ అనరు. కానీ అందుకు దారి తీయాల్సిన పరిస్థితులు విశ్లేషించి అసలు దోషులకు శిక్షపడాలి. అలా జరగడం లేదు.. ఇదే విచారకరం.. ప్రభుత్వం పంతానికి పోకుండా పరీక్షను వాయిదా వేసినా.. మార్చ్‌కు అనుమతిచ్చినా.. అడుగడుగునా ఆంక్షలు, అక్రమ కేసులు పెట్టకపోయినా.. నేతలను అరెస్ట్ చేసిఉండకపోయినా దాడుల తీవ్రత తగ్గిఉండేది. ఇలాంటి పరిస్థితులు రాకుండా చేయగలిగేది, వస్తే పరిష్కరించగలిగేవి ప్రభుత్వాలు, ప్రతిపక్షాలే.. కాని దురదృష్టమేమిటంటే ఇక్కడ సమస్యలకు అసలు కారకులు వారే.. ఇక దోషులు ఎవరు.. నిందితులు ఎవరు.. శిక్షించేదెవరు.. తప్పును ప్రశ్నించేదెవరు...

సంపత్















Sunday, March 6, 2011

విజయానికి సోపానం... ఆత్మ విశ్వాసం



విజయం సాధించాలంటే ముందుగా ఆత్మవిశ్వాసం కావాలి. అనుకున్నంత సులభంగా దీన్ని సంపాదించలేము. ఎందుకంటే దీని కోసం పలు అంశాలను జయిం చాల్సి ఉంది. ఇది లేకపోవడాన్నే ఇన్‌ఫిరియార్టీ కాంప్లెక్స అని కూడా అంటారు. అసలేంటీ ఈ ఇన్‌ఫిరి యార్టీ కాంప్లెక్స ఎందుకు వస్తుంది కారణాలేమిటి అధిగమించడానికి మార్గాలున్నాయా అంటే ఉన్నాయి. వాటిని ఈ వారం చూద్దాం.
నేనేది సాధించలేను, నేను అందంగా లేను, నాకు ఏమీ తెలీదని ఇతరులను చూస్తే కలిగే భావనే ఇన్‌ఫిరియార్టీ కాంప్లెక్స. అంటే ఆత్మవిశ్వాసం లోపించడం, ఏపనిలో దిగినా ఈ ఆత్మవిశ్వాస లోపం మిమ్మల్ని వెంటా డుతూ ఉం టుంది. దీనికి కారణం గతంలో ఏదో ఒక పనిలో మీరు విఫలం కావడమే. ఈ వైఫల్యమే మీ భవిష్యత్తులో కూడా జరుగుతుందని మీ మనస్సులో ఏర్పడే భిమే దీనికి కారణం. ముందుగా మిమ్మల్ని మీరు విశ్వసించండి అంటే మీరే ఏ పనైనా చేయగలరు. ఎవ రికీ తీసిపోరని మనసుకు గట్టిగా చెప్పు కోండి. మిమ్మల్ని ఎవరైనా నొప్పించే విధం గా ప్రవర్తిస్తే వారిని వెంటనే మన్నించండి. అలా చేయడంతో వారి తప్పు వారికే తెలి సొస్తుంది. అలాగే మీ పక్క వారిలో మంచి గుణాలు మీకు లేవని మీరు అనుకుంటే వాటిని సాధించడం కోసం ఏమి చేయాలో ఆలోచించండి. అంతేకానీ వారిపై ఈర్ష్యా ధ్వేషాలు పెంచుకోవద్దు. విజయం సాధిం చడానికి తొలి మెట్టుగా టేకిట్‌ ఈజీ విధా నాన్ని అలవర్చుకోవాలి. అంటే మీకు కావ లిసిన విషయాలను మెదడులోకి ఎక్కిం చండి. అక్కరలేని విషయాలను అక్కడే వదిలేయండి.. లేదంటే వాటి గురించి ఆలోచిస్తే మనసు పాడవుతుంది. అనవసర విషయాలను మనసులోకి ఎక్కించుకో కుండా ప్రశాంతంగా ఉండగలిగితే అదే మీరు సాధించే తొలి విజ యం అవుతుంది.

మీలో ఆత్మన్యూనతా భావం కలుగకుండా ఉండాలంటే మీరు ఎవరిపైనా ఆధారపడకూడదు. ఎందుకంటే అంతవరకు మీ వెంట ఉన్నవారు ఒక్కసారిగా వెళ్ళిపోతే మీరు ఒత్తిడికి గురై తేరురకోలేని ప్రమాదం వుంది. మీకు మీరు స్వతంత్రంగా వ్యవహరించ డానికి అలవాటు పడండి. ఏ పని చేసినా మీరు మీపై విశ్వాసాన్ని సాధించండి. మీకు తెలియని విషయాల కోసం ఇతరుల సాయం కోరవచ్చు. కానీ అదే అలవాటుగా చేసుకోకండి. అందుకోసం ముందుగా మీరు ఆ పనిలోకి దిగండి. మీకు నష్టాలు వస్తే మీ వెనుకుండే వారిని సలహాలు అడగండి. తప్పక విజ యం మీదే అవు తుంది. పైకి రావడానికి తప్ప కుండా మీ చేయూత కావాల్సిందే. అయితే అదే మనకు శాపంగా మార కూడదని గుర్తుంచుకోండి. అంతే కాకుండా చాలా మంది తల్లి చాటు, తండ్రి చాటు బిడ్డల్లాగా పెరుగుతుంటారు. వారి తల్లిదండ్రులు మాత్రం వారి వెంట ఎంత వరకు ఉంటారనేది ఆలోచించుకోవాలి. తమంతట తాము చేసే ప్రయత్నం తప్పకుండా విజయాలను సాధించిపెడు తుంది. అయితే తల్లి చాటు బిడ్డ లక్షణా లను చాలా మంది గొప్పగా చెప్పుకుంటుం టారు. దీనిని గొప్పగా కంటే అసమర్ధత అనవచ్చు. ఎవరు ఉన్నా లేకపోయినా మనంతట మనం పనులు సాధించుకోగలిగే సత్తా ఉండాలి. అప్పుడే జీవితంలో విజయాలను సాధించగలం.

అందుకని సాధ్యమైనంత వరకు ఆధారపడటం మానేసి స్వతంత్రంగా వ్యవహరించడం నేర్చుకోవాలి. విజయాన్ని సాధించేందుకు వ్యక్తిగత సంసిద్ధత చాలా ముఖ్యమని మనస్తత్వ శాస్త్రజ్ఞులు పేర్కొంటున్నారు. నేర్చుకోవడానికి ఎప్పుడూ సిద్థంగా ఉండాలని వారు అంటున్నారు. ఏదైనా సంభ్రమాన్ని కలిగించే విజయం సాధించే వ్యక్తులతో మాట్లాడటం, వారు సాధించిన స్థానాన్ని ఎలా పొందారో తెలుసుకోవడం, వారు ఎన్నెన్ని కష్టాలు అనుభవించారో వాటిని తెలుసుకోవడం వంటివి చేయాలి. వారు చేసిన పొరపాట్లు, అనుభవించిన పరాభవాలు విజయ సాధనకు దోహదపడుతాయి. దీనితో పాటు విజయం సాధించేందుకు సాహసం అవసరమని మనోతత్వ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సవాళ్ళను ఎదుర్కోవడం అధునాతన విధానాలను పాటించడం ద్వారా పాత పద్ధతులకు స్వస్తి చెప్పడం వంటివి చేస్తే కచ్ఛితంగా విజయానికి దగ్గరవుతారు. సాహసంతో కృషి కూడా తప్పకుండా ఉంటే విజయం మీకు చేరువైనట్లే!

-ఎన్‌. మానస

Saturday, February 26, 2011

మేం గర్విస్తున్నాం

అవును. మేం సిగ్గు పడడం లేదు. గర్విస్తున్నాం. అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల తొలి రోజు తెలంగాణ ఎమ్మెల్యేలు ప్రవర్తించిన తీరును మనస్పూర్తిగా అభినందిస్తున్నాం. దాన్నో వీరోచిత ఘట్టంగానూ, స్పూర్తిదాయక సంఘటనగానూ మా హృదయ ఫలకాల మీద ముద్రించుకుంటున్నాం. రేపటి తెలంగాణ చరిత్రలో ఈ సంఘటనను సువార్ణక్షరాలతోనే లిఖించుకుంటాం. నిండు సభలో ఏదో అపచారం జరిగినట్టుగా ఎవరూ బాధపడాల్సిన పని లేదు. కన్నీళ్లు పెట్టుకోవాల్సిన అవసరమూ లేదు.

అనుమానం లేదు. డిసెంబర్ 31 తరువాత జనవరి ఫస్టే వస్తుందని ఎకసెక్కాలడిన గవర్నర్ కు జరగవలిసిన పరాభవమే జరిగింది. డిసెంబర్ 31 తరువాత జనవరి ఫస్టే కాదూ ఫిబ్రవరి 17 కూడా వస్తుందనే విషయం బహుశా గవర్నర్ నరసింహన్ కు ఇప్పుడు అర్ధమై వుంటుంది. ఎప్పుడు, ఎక్కడ, ఎవరి మీద ఎలా తిరగబడాలో అలాగే తిరగబడ్డ మా తెలంగాణ బిడ్డలకు జేజేలు. ఇది అనైతికమూ కాదూ: అరాచకమూ కాదు; అసహజమూ కాదు. గవర్నర్ ప్రసంగాన్ని అడ్డుకోవడం, ప్రసంగ ప్రతులు చింపివేయడం తప్పు కానేకాదు. గవర్నర్ కుర్చీలో కూర్చున్న నరసింహన్ నిష్పక్షపాతంగా వ్యవహిస్తున్నారని తెలంగాణ ప్రజలు నమ్మడం లేదు. కాబట్టి, ఆయన ప్రసంగాన్ని మైమరచి వినాల్సిన అవసరం తెలంగాణ ప్రజాప్రతినిధులకు లేదు. మొన్నటి ఉప ఎన్నికల్లో టియ్యారెస్ ఎమ్మెల్యేలకు భారీ మెజార్టీలు ఇచ్చి గెలిపించింది - వారిని ఎమ్మెల్యేలుగా చూసుకుని మురిసిపోవడానికి కాదు. సమైక్యాంధ్ర ప్రభుత్వం పెట్టే బడ్జెట్ కు చప్పట్లు చరిచి, బిల్లులు ఆమోదించుకుంటుంటే చూస్తూ కూర్చోవడానికీ కాదు. తమ తరుపున అసెంబ్లీలో పోరడడానికీ, అసెంబ్లీని స్తంభింపచేసైనా తెలంగాణ సాధించుకుని రావడానికే భారీ మెజార్టీ లు ఇచ్చారు. ఈ లెక్కన చూసినప్పుడు వారు తమ కర్తవ్యాన్ని ఫిబ్రవరి 17న చక్కగానే నిర్వర్తించారు.


సమైక్య రాష్ట్రాన్ని కాపాడే కాపలా కుక్క పాత్రలో తనను తాను ఇముడ్చుకుంటున్న గవర్నర్ కళ్లలో కనిపించిన భయం తెలంగాణ బిడ్డల ధీరత్వానికి సంకేతం. మున్ముందు కూడా ఇదే పోరాట పటిమను ప్రదర్శిస్తారనే ఆశిద్దాం. సమైక్య రాష్ట్రంలో అసెంబ్లీ సమావేశం ఏ ఒక్క క్షణం సజావుగా సాగినా, సమైక్యాంధ్ర పెట్టుబడిదారుల ప్రయోజనాలను కాంక్షించే ఏ ఒక్క బిల్లు ఆమోదం పొందినా ఆ మేరకు తెలంగాణ ప్రజల సొమ్ము వృధా అయినట్టే లెక్క. అసెంబ్లీ నిర్వహణకు అయ్యే ఖర్చులో సీమాంధ్ర ప్రజల సొమ్మే కాదు- తెలంగాణ ప్రజల సొమ్ము కూడా వుంది. అసెంబ్లీ సమావేశాలు ప్రశాంతంగా, సజావుగా సాగడం సమైక్యవాదులకు ఎంత అవసరమో, వాటిని అడుగడుగునా అడ్డుకోవడం తెలంగాణవాదులకు అంతే అవసరం. ఈ స్పృహ లోపించినవారికి అసెంబ్లీలో జరిగినదంతా అరాచకంగానూ, అసాధారణంగానూ, అనూహ్యంగానూ, అవాంఛనీయంగానూ, దురదృష్టకర సంఘటనగానూ కనిపించడంలో ఆశ్చర్యం లేదు. ఈ స్పృహ లోపించింది కాబట్టే లోక్ సత్తా నేత జయప్రకాష్ మీడియా పాయింట్ లో నోటికొచ్చినదంతా మాట్లాడారు. భారతీయులకు పరిపాలించుకోవడం చాతకాదు. వారికి స్వాతంత్ర్యం ఎందుకంటూ విన్ స్టన్ చర్చిల్ చేసిన వంకర వ్యాఖ్యలను ఉటంకించి, తెలంగాణ ఉద్యమాన్ని, తెలంగాణ ప్రజల స్వేచ్ఛా పిపాసను కించపరిచే ప్రయత్నం చేశారు. ఆయన చేసిన ఈ అనుచిత వ్యాఖ్యలే ఆయన మీద దాడికి కారణమయ్యాయి. ఆయన నోరు పారేసుకున్నారు. వీళ్లు చేయి చేసుకున్నారు! ఇలాంటివాళ్లను చూసే నోరు మంచిదైతే, ఊరు మంచిదవుతుందనే సామెత పుట్టింది. కాబట్టి, ఎప్పుడూ ప్రజాస్వామిక విలువల గురించి మాట్లాడే జయప్రకాష్ లాంటి వాళ్లు తమ వంకర బుద్ధులు, వంకర మాటలు, వంకర చేష్టలు మానుకోవడం మంచిది. ప్రజాస్వామిక విలువల మీద నిజమైన ఆపేక్ష ఉన్నవాళ్లు మరింత బాధ్యతాయుతంగా మాట్లాడడం, ప్రవర్తించడం నేర్చుకోవాలి. తెలంగాణ ఉద్యమానికి సంబంధించినంత వరకు జయప్రకాష్ లో ఈ స్పృహ ఏనాడూ కనిపించలేదు. తెలంగాణ ప్రజలకు ఒక మిత్రుడిగా దగ్గరయ్యే ప్రయత్నం ఆయన ఏనాడూ చేయలేదు. తెలంగాణ ఉద్యమం కొత్త దశలో ప్రవేశిస్తున్న ఈ సమయంలో ఇలాంటి దాడులు వ్యూహాత్మకంగా కరెక్టా? కాదా? వాటి వల్ల మేలు జరుగుతుందా? కీడు జరుగుతుందా? అనే విషయాన్ని తెలంగాణ ఉద్యమ నాయకత్వం సమీక్షించుకోవాలి. అంతేతప్ప ఏదో అపచారం జరిగినట్టుగా బాధపడాల్సిన పనేమీ లేదు. జయప్రకాష్ మీద జరిగిన దాడిని ప్రజాస్వామ్యం మీద జరిగిన దాడిగా చూడాల్సిన అవసరం లేదు. ప్రజాస్వామిక ముసుగు తొడుక్కొని, కౌరవ పక్షపాతిగా ప్రవర్తిస్తున్న ఓ వ్యక్తి మీద జరిగిన దాడిగానే చూడాలి. ప్రజాస్వామిక పోరాటాల పట్ల ఆయన తన మైండ్ సెట్ మార్చుకుంటే ఈ కాస్త గౌరవమైనా మిగులుతుంది.
కృష్ణప్రసాద్ 18/2/2011

Thursday, February 24, 2011

నింగికెగసిన సాహితీదిగ్గజం



దేవులపల్లి.. శ్రీశ్రీ.. ఆత్రేయల సరసన చేర్చదగిన మరో సినీ సాహితీ దిగ్గజం నింగికెగసింది. ముళ్ళపూడి వెంకటరమణ అనితరసాధ్యమైన సాహిత్యాన్ని మనకు మిగిల్చి వెళ్ళారు. బాపు రమణల జంటగా.. దేహాలు రెండు ఆత్మలు ఒకటిగా.. వెండితెరపై నవరసాలొలికించి తెలుగు ప్రేక్షకులను అలరించారు.


మడిసన్నాక కుసంత కళాపోసనుండాలి.. తిని తొంగుంటే మడిసికి గొడ్డుకూ తేడా ఏటుంటాది.. అంటూ గోదావరి జిల్లా ఎటకారంతో తెలుగు సినిమాకు కొత్త డిక్షన్ ఇచ్చిన సాహితీ సౌరభం. రక్తసంబంధం సినిమాతో తెలుగు తెరకు పరిచయమయ్యాడు ముళ్ళపూడి. మూగమనసులు.. దాగుడుమూతలు.. ప్రేమించి చూడా లాంటి సూపర్ హిట్ సినిమాలకు పనిచేసాక తన చిరకాల మిత్రుడు చిత్రకారుడు అయిన బాపును తెలుగు తెరకు దర్శకుడిగా సాక్షితో పరిచయంతో చేసాడు. ముళ్ళపూడి రాత.. బాబు గీత కలిసి నాస్తికత్వం.. ఆస్తికత్వం కలసిన మానవీయ చిత్రం బుద్ధిమంతుడుగా రూపొందింది.

పగలు-రాత్రి.. పడుగు-పేక.. ఆటు-పోటు..లా బాపు-రమణ.. కూడా తెలుగుభాషలో జంటపదాలై కూర్చున్నాయి. వారి స్నేహం.. అనుబంధం.. షష్టిపూర్తి కూడా చేసుకుంది. స్కూల్లో మొగ్గ తొడిగిన వారి స్నేహం.. పత్రికా రంగంలో పువ్వై విరిసింది. చలన చిత్రరంగంలో ఫలించింది. బాపురమణల జంట ప్రయాణం తర్వాత నిరాటంకంగా కొనసాగింది. బంగారు పిచుక.. బుద్ధిమంతుడు.. బాలరాజుకధ.. సంపూర్ణ రామాయణం.. హిట్లు.. ఫ్లాపులు.. ఏమైనా అవిచ్ఛన్నంగా నిండు గోదారిలా సాగింది.

ఆ దశలో పాపికొండల్లో గోదావరి ప్రయాణ నేపధ్యంగా అందాల రాముడు తీశారు. ఓ పిక్నిక్ లా సాగిన షూటింగ్ జరిగింది కాని ఫలితం చేదునే మిగిల్చింది. బాపు రమణలు వాళ్ళ మీదే వాళ్ళే కార్టూన్లు వేసుకునేలా చేసింది. సెకండ్ రిలీజ్ లో కాస్త పేరు సంపాదించి పెట్టినా ఫస్ట్ రిలీజ్ లో ఓ లాంచీలో సినిమా అంతా చుట్టేసాడ్రా అనే పేరు మాత్రం తీసుకొచ్చింది. ఆనాటి అందాల రాముడు ఈనాటి శేఖర్ కమ్ముల గోదావరికి ప్రేరణ కూడా.



బాపు రమణల మాగ్నం ఓపస్ అనదగిన సినిమా ముత్యాల ముగ్గు. ఓరంత కట్టపడిపోతన్నావేటిరా కొత్తపెళ్ళి కొడకా.. అంటూ వెటకారాలాడినా.. ఆ ముక్క నేను లెక్కెట్టుకో మునపే సెప్పాల... డిక్కీలో తోయించేగల్ను జగరత్త.. అంటూ చెంప పగలగొట్టి కళ్ళెర్ర చేసినా.. మర్డరు కెంత? మెడిసిను సీటుకెంత? కాలు చేయి తియ్యడానికెంత? మర్డరుకూ సీటుకూ ఎంత?కాలు చెయ్యితీయడానికీ, మెడిసిన్ సీటుకీ ఎంత? వోల్ మొత్తం మీత ఏమయినా కన్సెసను ఉంటుందా? .. సాక్షాత్తూ రావణాసురుడి లాంటి రావుగోపాలరావు మీదే సెటైర్లు వేయించినా రమణకే చెల్లింది.



అంత ఘనం కామెడి రాసిన కలమే.. వాడికి స్త్రీజాతిమీద నమ్మకం పోయింది.నాకు మనుషులమీదే నమ్మకంపోయింది.. అంటూ అద్భుతంగా కరుణరసం కూడా కురిపించింది. ముత్యాల ముగ్గు డైలాగులు ఎల్.పి.రికార్డులగా.. కాసెట్స్ గా.. ఎంత పాపులర్ అయ్యాయో ఆనాటి ప్రేక్షకులకు ఇంకా గుర్తుండే ఉంటాయి.



ముళ్ళపూడి వెంకటరమణ హాస్యాన్ని.. సెంటిమెంటునే కాదు భక్తిని కూడా అద్భుతంగా రాయగలడని రుజువు చేసిన చిత్రం భక్తకన్నప్ప. రమణ కరుణరసానికి మరో మంచి ఉదాహరణ భక్తకన్నప్ప. కృష్ణంరాజుని గిరిజనుడిగా.. శివభక్తుడిగా.. రెండు పాత్రలలోని వేరియేషన్ని తన రచనలో గొప్పగా చిత్రించాడు రమణ. అంత గొప్పగా చిత్రీకరించాడు బాపు.



బాపు రమణల కాంబినేషన్లో మరో సెన్సేషనల్ సినిమా మన ఊరి పాండవులు. మహాభారతాన్ని లోకలైజ్ చేస్తూ రాసిన మరో సెటైర్ ఈ చిత్రం. ఇటు కృష్ణంరాజు డైలాగులు.. అటు రావుగోపాలరావు డైలాగులు.. తెలుగు దేశాన్ని ఉర్రూతలూగించాయి.



ఆ తర్వాత చిరంజీవితో మంత్రిగారి వియ్యంకుడు రమణ కలం చిందులు తొక్కింది. కాయ్ కాయ్ కొబ్బరి కాయ్.. అంటూ రమణ రాసిన టీజింగ్ సీన్స్ రక్తి కట్టించాయి. బాపు తీత.. రమణ రాత.. చిరంజీవి కెరీర్ కు ఆరోజుల్లో ఎంతో ఉపయోగపడింది.



భార్యా భర్తల మధ్య తియ్యని రాజీలు.. అనుమానం నుంచి అర్ధం చేసుకోడాలు. అర్ధం చేసుకోడం నుంచి సౌఖ్యాలు.. సౌఖ్యం నుంచి సంతోషాలు.. సంతోషం నుంచి స్వార్ధం.. స్వార్ధం నుంచి మళ్ళీ అనుమానాలు.. ఇలా అంతులేని వలయంగా తిరిగే మొగుడు పెళ్ళాల గోలను జనరంజకంగా రచించాడు రమణ. స్వీట్ నథింగ్స్ ను స్వీట్ సంథింగ్స్ గా అద్భుతంగా మలచిన బాపు రమణల కాంబినేషన్ అరవైలో ఇరవైగా మారి తీసిన సినిమా ఇది.



భార్య భర్తల మధ్య సంబంధాలను మరో కోణం నుంచి సృశించిన సబ్జెక్ట్ మిస్టర్ పెళ్ళాం. ఎవరు ఎక్కువ ఎవరు తక్కువ అనే వాదం నుంచి పుట్టిన వివాదానికి రమణ అద్దిన పదాల సొబగులు సినిమాను అందంగా తీర్చిదిద్దాయి. రాధాగోపాలం కూడా ఓ రకంగా భార్యాభర్తల వాదాలు వివాదాలతో రూపొందిన సినిమానే. బాపు-రమణల సృష్టి పాత సీసాలో పాత సారాగా అనిపించింది. అంతగా ఆకట్టుకోలేకపోయింది. తర్వాత వచ్చిన సుందరకాండది అదే పరిస్థితి.



బాపు రమణల చివరిచిత్రం శ్రీరామరాజ్యం. బాలకృష్ణ రాముడిగా నటిస్తున్న ఈ చిత్రం బాపు రమణల అరవై ఏళ్ళ స్నేహానికి చివరి గుర్తుగా మిగలబోతుంది. రమణలేని బాపును రాత లేన గీతగా ఊహించుకోడం మనకే కాదు ఆయనకు కూడా కష్టమే. సీగానపెసూనాంబ లేని బుడుగులా.. సీత జాడ తెలియని రాముడిలా.. రెండుజెళ్ళసీత లేని గోపాలంటా.. బాపు ఇక ఒంటరి వాడు. ముళ్ళపూడి ఆకస్మిక మృతికి నివాళులర్పిద్దాం..

Friday, February 18, 2011

అతి పెద్ద ఆకాశ హర్యాలు

భవన నిర్మాణరంగంలో మానవుని మేధాశక్తి అంబరాన్ని తాకుతోంది.ఇటీవలికాలంలో ఈ రంగంలో సాంకేతిక పరిజ్ఞానం ఎంతో అభివృద్ధి చెందింది. 21వ శతాబ్దంలో మనిషి తన మేధాశక్తికి మరింత పదునుపెట్టి అద్భుతాలు సృష్టిస్తున్నాడు. దానికి ప్రత్యక్ష ఉదాహరణే దుబాయ్‌లోని అతి పెద్దదైన ‘బుర్జ్‌ ఖలీఫా’ భవనం. 1.5 బిలియన్‌ డాలర్ల వ్యయంతో కేవలం ఐదేళ్ళలో 160 అంతస్తులతో రూపొందించిన ఈ ఆకాశ సౌధం ప్రపంచంలోనే అత్యంత ఎతె్తైన భవనంగా గుర్తింపు పొందింది. ఇవేకాకుండా ప్రపంచంలో ఇలాంటి కొన్ని భవనాలున్నాయి. ఈ నేపథ్యంలో వ్యాపార, నివాస అవసరాలకోస నిర్మించిన అనేక భవనాల్లో నిర్మాణపరంగా తొలి పది స్థానాల్లో నిలిచిన ఎతె్తైన ఆకాశ సౌధాలపై ఓ కథనం...

petronas-towers.jpgఆకాశహార్మ్యాల నిర్మాణంలో చైనీయులు అందరికంటే ముందు వరసలో ఉన్నారు. ప్రపంచంలోని టాప్‌ టెన్‌ ఎతె్తైన భవనాల్లో ఆరు భవనాలు చైనా, హాంగ్‌కాంగ్‌లలోనే నిర్మితం కావడం విశ ేషం. 1998 వరకు చికాగోలోని విల్లిస్‌ టవర్స్‌దే అగ్రస్థానం. 1974లో నిర్మించిన ఈ భవనం ఇరవైనాలుగేళ్ళపాటు తన ఆధిపత్యాన్ని చెలాయించింది. అయితే ఈ భవనం ఇప్పుడు ఏడవ స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చిం దంటే భవన నిర్మాణ రంగంలో మూడు దశాబ్దాలలో ఎంత మార్పు సంభవించిందో అర్ధం చేసుకోవచ్చు. రోజురోజుకూ పెరిగిపోతున్న జనాభాను దృష్టిలో ఉంచుకొని అపార్ట్‌మెంట్లను నిర్మించడం పరిపాటిగా మారింది.

అత్యధిక జనా భా ఉండే మహా నగరాలలోనైతే ఇక చెప్పనవసరం లేదు. కేవ లం నివాస అవసరాలకే కాకుండా వ్యాపార అవసరాల కోసం పెద్ద షాపింగ్‌ మాల్స్‌ను నిర్మించడం కూడా గత రెండు మూ డు దశబ్దాల్లో ఎక్కువైంది. అయితే ఇలాంటి ఆకాశ సౌధాలు నిర్మించడం మానవ అవసరాల మాట అలా ఉంచితే ఇలాంటి నిర్మాణాల వలన భూకంపాలు, నీటి కొరత లాంటి సమస్యలు ఉత్పన్నమయ్యే అవకాశం ఉందని తెలియజేస్తున్నారు పర్యావరణవేత్తలు. భద్రత విషయంలో కూడా ఇవి శ్రేయస్కరం కా దని వారి అభిప్రాయం. ఏదేమైనప్పటికీ భవన నిర్మాణ రం గం లో అందనంత ఎత్తుకు ఎదిగిన మనిషి మేధా సంపత్తికి జై కొట్టాల్సిందే.

నేనెవరికీ అందను...
ప్రపంచంలోనే ఎతె్తైన మానవ నిర్మితంగా గుర్తింపు పొందిన దుబాయ్‌లోని బుర్జ్‌ ఖలీఫా భవనంలో మొత్తం 160 ఫోర్లు ఉండడం విశేషం. దీనిని బుర్జ్‌ దుబాయ్‌ అని కూడా పిలుస్తారు. 21 సెప్టెంబర్‌ 2004న పునాదులు వేసుకున్న ఈ భవన నిర్మాణం గత ఏడాది అక్టోబర్‌ 1వ తేదీన పూర్తయ్యిం ది. కేవల ఐదేళ్ళ రికార్డు కాలంలో నిర్మించిన ఈ నిర్మాణానికి 1.5 బిలియన్‌ డాలర్లు ఖర్చయిందట. 490 ఎకరాల విస్తీర్ణం లో నిర్మించిన ఈ భవన నిర్మాణానికి బిల్‌ బేకర్‌ అనే ఇంజనీర్‌ ఛీ్‌ఫ్‌ ఆర్కిటెక్ట్‌గా వ్యవహరించారు.ఎమార్‌ ప్రాపర్టీస్‌ సం స్థ ఆధ్వర్యంలో నిర్మాణం పూర్తి చేసుకుంది.

చికాగోలోని విల్లిస్‌ టవర్స్‌, న్యూయార్క్‌లోని ప్రఖ్యాత వరల్డ్‌ ట్రేడ్‌ సెంటర్‌ లాంటి నిర్మాణాలకు సాంకేతిక పరిజ్ఙానాన్ని అందించిన స్కిడ్‌మోర్‌, ఓవింగ్స్‌ అండ్‌ మెరిల్‌ సంస్థ బుర్జ్‌ ఖలీఫాను డిజైన్‌ చేసింది.మలేషియాలోని పెట్రోనాస్‌ టవర్స్‌, తైవాన్‌లోని తైపీ 101లకు కాంట్రాక్టర్లుగా వ్యవహరించిన దక్షిణ కొరియాకు చెందిన శామ్‌సంగ్‌ ఇంజనీరింగ్‌లాంటి పలు సంస్థలు ఈ అ ద్భుత నిర్మాణంలో పాలుపంచుకున్నాయి. కార్యాలయాలకో సం ఆఫీస్‌ సూట్స్‌, వ్యాపార అవసరాలకోసం షా పింగ్‌ మా ల్స్‌, రెస్టారెంట్లతో పాటు రెసిడెన్షియల్‌ కాంప్లెక్స్‌ల ను కూడా ఇందులో పొందుపరచడం విశేషం. దక్షిణాసియా దేశాల నుం డి వెళ్ళిన సుమారు 7,500 మంది భవన నిర్మాణ కార్మికులు బుర్జ్‌ ఖలీఫా నిర్మాణంలో పాలుపంచుకున్నారు.

ఎత్తులో మేము సైతం...
తైపీ 101... బుర్జ్‌ ఖలీఫా నిర్మాణం పూర్తయ్యేవరకు ఈ నిర్మాణానిదే రికార్డు. 101 ఫ్లోర్లు కలిగి ఉండడంతో దీనికి ఆ పేరు వచ్చింది. కాన్ఫెరెన్స్‌ హాళ్లు, ఫిట్‌నెస్‌ సెంటర్లు, లైబ్రరీ, ఆఫీస్‌, రెస్టారెంట్‌, రిటైల్‌లాంటి ఎన్నో వ్యాపారాలకు ఇందు లో సదుపాయాలున్నాయి. ఈ భవనం యొక్క మరో విశిష్టత ఏమిటంటే వారంలో ఒక్కో రోజు ఒక్కో రంగులో దర్శనమివ్వడం తైపీ 101 ప్రత్యేకత. ప్రతిరోజు ఉదయం ఆరు గం టల నుండి రాత్రి పది గంటల వరకు ప్రతి రోజు వివిధ రం గుల్లో దర్శనమిచ్చే తైపీ 101...509 మీటర్ల ఎత్తుతో ప్రపం చంలోనే ఎతె్తైన భవానాల్లో రెండవ స్థానంలో ఉంది.

ఇక చైనాలో అత్యంత ఎతె్తైన ‘షాంఘై వరల్డ్‌ ఫైనాన్షియల్‌ సెంటర్‌’ ప్రపంచంలోని ఎతె్తైన భవనాల్లో మూడవ స్థానంలో కొనసాగుతోంది. 2008లో నిర్మాణం పూర్తి చేసుకున్న ఈ కట్టడంలో తైపీ 101 లాగే వ్యాపార అవసరాలకు కావాల్సిన సదుపాయాలున్నాయి. 492 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ భవనంలో 101 ఫ్లోర్లు, 91 లిఫ్ట్‌లు ఉన్నాయి. దీని తరువాతి స్థానాన్ని హాంగ్‌ కాంగ్‌లోని ‘ఇంటర్నేషనల్‌ కామర్స్‌ సెంటర్‌’ ఆక్రమించుకుంది. 484 మీటర్లు ఎ త్తులో ఉన్న ఈ భవనాన్ని ఎమ్‌టిఆర్‌ కార్పోరేషన్‌ లివి ుటెడ్‌ నిర్మించింది.

ప్రపంచంలో ఎతెతైన నిర్మాణాల్లో ఎక్కువ పాపులారిటీ సంపాదించిన మరో ఆకాశ సౌధం ‘పెట్రోనాస్‌ టవర్స్‌’. మలేషియా రాజధాని కౌలాలంపూర్‌లో నిర్మించిన ఈ జంట సౌధా లను1992-98 మధ్యకాలంలో నిర్మించారు. వీటి తరువాత నన్జింగ్‌ గ్రీన్‌లాండ్‌ ఫైనాన్షియల్‌ సెంటర్‌, విల్లిస్‌ టవర్‌, గువాంగ్‌జౌ వెస్ట్‌ టవ ర్‌, జిన్‌ మావో టవర్‌, ఇంటర్నేషనల్‌ ఫైనాన్షియల్‌ సెంటర్‌ లాంటి నింగినంటే నిర్మాణాలు టాప్‌-10 లిస్ట్‌లో పేరు సంపాదించాయి. ఈ విషయంలో భారత్‌ మాత్రం చాలా వెనకబడి ఉందనే చెప్పవచ్చు.

ప్రపంచంలోని టాప్‌ - 10 ఆకాశసౌధాలు
1. బుర్జ్‌ ఖలీఫా
ఎత్తు  : 828 మీటర్లు
అంతస్తులు : 160
సిటీ : దుబాయ్‌ (యూఏఈ)
ఆర్కిటెక్చర్‌ : స్కిడ్‌మోర్‌, ఓవింగ్స్‌ అండ్‌ మెరిల్‌
నిర్మాణ సంస్థ : ఎమార్‌ ప్రాపర్టీస్‌
నిర్మాణం ప్రారంభించింది: 21 సెప్టెంబర్‌ 2004
ప్రారంభం : 4 జనవరి 2010
నిర్మాణ వ్యయం : 1.5 బిలియన్‌ డాలర్లు
2. తైపీ 101
ఎత్తు : 509 మీ
అంతస్తులు : 101
సిటీ : తైపీ (తైవాన్‌)
ఆర్కిటెక్చర్‌ : సి.వై.లీ అండ్‌ పార్ట్‌నర్స్‌
నిర్మాణ సంస్థ : కేటీఆర్‌టీ జాంయింట్‌ వెంచర్‌,
శామ్‌సంగ్‌ సీ అండ్‌ టీ.
నిర్మాణం కాలం : 1999-2004
నిర్మాణ వ్యయం : 1.76 బిలియన్‌ డాలర్లు
3. షాంఘై వరల్డ్‌ ఫైనాన్షియల్‌ సెంటర్‌
ఎత్తు : 492 మీటర్లు
అంతస్తులు : 101
సిటీ : షాంఘై
దేశం : చైనా
ఆర్కిటెక్చర్‌ : కోన్‌ పెడర్సన్‌ ఫాక్స్‌
నిర్మాణ సంస్థ : మోరి బిల్డింగ్‌ కంపెనీ
నిర్మాణ కాలం : 1997-2008
నిర్మాణ వ్యయం : 1.2 బిలియన్‌ డాలర్లు
4. ఇంటర్నేషనల్‌ కామర్స్‌ సెంటర్‌,
ఎత్తు : 483 మీటర్లు
అంతస్తులు : 118
దేశం : హాంగ్‌ కాంగ్‌
ఆర్కిటెక్చర్‌ : వాంగ్‌ అండ్‌ ఒయాంగ్‌ లిమిటెడ్‌
నిర్మాణ సంస్థ : సన్‌ హంగ్‌ కాయ్‌ ప్రాపర్టీస్‌
నిర్మాణం కాలం : 2002-09
5. పెట్రోనాస్‌ టవర్స్‌
ఎత్తు : 452 మీటర్లు
అంతస్తులు : 88
సిటీ : కౌలాలంపూర్‌
దేశం : మలేషియా
ఆర్కిటెక్చర్‌ : సెసర్‌ పెల్లి
నిర్మాణ సంస్థ : హజామా కార్పోరేషన్‌, శామ్‌సంగ్‌ సీ అండ్‌ టీ
నిర్మాణ కాలం : 1992-98
6. నన్జింగ్‌ గ్రీన్‌లాండ్‌ ఫైనాన్షియల్‌ సెంటర్‌
ఎత్తు : 450 మీటర్లు
అంతస్తులు : 89
సిటీ : నన్జింగ్‌
దేశం : చైనా
ఆర్కిటెక్చర్‌ : స్కిడ్‌మోర్‌, ఓవింగ్స్‌ అండ్‌ మెరిల్‌
నిర్మాణ సంస్థ : స్కిడ్‌మోర్‌, ఓవింగ్స్‌ అండ్‌ మెరిల్‌
నిర్మాణం కాలం : 2008 నుండి నిర్మాణంలో ఉంది
7. విల్లిస్‌ టవర్‌
ఎత్తు : 442 మీటర్లు
అంతస్తులు : 108
సిటీ : చికాగో
దేశం : అమెరికా సంయుక్త రాష్ట్రాలు
ఆర్కిటెక్చర్‌ : స్కిడ్‌మోర్‌, ఓవింగ్స్‌ అండ్‌ మెరిల్‌
నిర్మాణ కాలం : 1970 - 73
8. గువాంగ్‌జౌ వెస్ట్‌ టవర్‌
ఎత్తు : 440
అంతస్తులు : 103
సిటీ : గువాంగ్‌జౌ
దేశం : చైనా
నిర్మాణ సంస్థ : విల్కిన్సన్‌ ఐర్‌
నిర్మాణ కాలం : 2009
9. జిన్‌ మావో టవర్‌
ఎత్తు : 421 మీటర్లు
అంతస్తులు : 8
సిటీ : షాంఘై
ఆర్కిటెక్చర్‌ : స్కిడ్‌మోర్‌, ఓవింగ్స్‌ అండ్‌ మెరిల్‌
నిర్మాణ కాలం : 1994-98
10. టూ ఇంటర్నేషనల్‌ ఫైనాన్స్‌ సెంటర్‌
ఎత్తు : 416 మీటర్లు
అంతస్తులు : 88
దేశం : హాంగ్‌ కాంగ్‌
ఆర్కిటెక్చర్‌ : రొకో డిజైన్‌ లిమిటెడ్‌
నిర్మాణ సంస్థ : ఐ.ఎఫ్‌.సీ

దేశంలో ఇంపీరియలే టాప్‌...
ఆకాశ హర్మ్యాల నిర్మాణాల్లో భారత్‌కు టాప్‌-100లో కూడా చోటు దక్కకపోవడం గమనార్హం. ప్రస్తుతం ముంబ యిలోని ఇంపీరియల్‌ 1, 2 జంట రెసిడెన్షియల్‌ టవర్లే భారత్‌లో ఎతె్తైన నిర్మాణాలు. 60 అంతస్తులు కలిగిన ఈ భవనాల ఎత్తు 249 మీటర్లు. ప్రపంచంలో ఎతె్తైన భవనాల్లో ఇంపీరియల్‌ స్థానం 153. భారత్‌లోనే ఎతె్తైన ఈ భవనాల లిస్టులో ముంబాయిలోని ‘అశోక టవర్స్‌’, బెంగుళూరులోని ‘యూబీ టవర్స్‌’ తర్వాతిస్థానాల్లో ఉన్నాయి. అయితే ప్రస్తుతం ముంబయిలో నిర్మాణ దశలో ఉన్న ‘ఇండియా టవర్స్‌’(301 మీ), ‘లోధా బెల్లిసిమో’(252) నిర్మాణాలు పూర్తయితే ఎతె్తైన భవనాల స్థానాల్లో మన స్థానం మరింత మెరుగుపడే అవకాశం ఉంది.

Wednesday, February 2, 2011

కనువిందు చేయనున్న క్రికెట్‌ పండుగ

క్రికెట్ప్రేమికులు ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న సమయం రానే వచ్చింది. పదో ప్రపంచకప్వన్డే క్రికెట్సమరం మరో పక్షం రోజుల్లో ప్రారంభం కానుంది. 14 జట్లు పాల్గొంటున్న మెగా క్రికెట్పండగ ఫిబ్రవరి 19 ప్రారంభం కానుంది. భారత్‌-బంగ్లాదేశ్జట్ల మధ్య మీర్పూర్లో జరిగే డే-నైట్వన్డేతో క్రికెట్సమరానికి తెరలేవనుంది. ఉపఖండంలో జరిగే ప్రపంచకప్కు భారత్‌, శ్రీలంక, బంగ్లాదేశ్లు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. పాకిస్తాన్కూడా ఆతిథ్యదేశంగా ఉన్నా భద్రత కారణాల వల్ల అక్కడే జరిగే మ్యాచ్లను ఇతర వేదికలకు మార్చారు. పాక్లో జరగాల్సిన మ్యాచ్లను భారత్‌-శ్రీలంక దేశాలు నిర్వహించనున్నాయి. టోర్నీలో మొత్తం 14 దేశాల జట్లు పాల్గొంటున్నాయి. జట్లను , బి గ్రూపులుగా విభజించారు. ఒక్కో గ్రూపులో ఏడేసి జట్లు ఉంటాయి. లీగ్దశలో ప్రతి జట్టు తన గ్రూపులోని జట్టుతో తలపడుతుంది. అంటే ప్రతి జట్టు లీగ్దశలో ఆరేసి మ్యాచ్లు ఆడుతుంది. గ్రూప్లో అగ్రస్థానంలో నిలిచే నాలుగు జట్లు క్వార్టర్ఫైనల్కు చేరకుంటాయి. లీగ్దశలో మొత్తం 42 మ్యాచ్లు జరుగుతాయి. దీనిలో అత్యధిక మ్యాచ్లకు భారత్ఆతిథ్యం ఇవ్వనుంది. భారత్లో మొత్తం 29 మ్యాచ్లు జరుగనున్నాయి. ఫైనల్ఏప్రిల్రెండు ముంబైలోని వాంఖేడే స్టేడియంలో ఫ్లడ్లైట్ల వెలుగు జరుగుతుంది. రెండు సెమీఫైనల్మ్యాచుల్లో ఒకటి శ్రీలంకలో, మరోకటి భారత్లో జరుగుతాయి. తొలి సెమీస్పోరు మార్చి 29 కొలంబోలోని ప్రేమదాస స్టేడియంలో, రెండో సెమీస్మార్చి 30 మొహాలి స్టేడియంలో జరుగనున్నాయి. కాగా, క్వార్టర్ఫైనల్మ్యాచుల్లో రెండు బంగ్లాదేశ్లో జరుగుతాయి. మిగిలిన మ్యాచులకు భారత్‌, శ్రీలంక ఆతిథ్యం ఇస్తాయి. లీగ్మ్యాచ్లు మార్చి 20 ముగుస్తాయి. నాకౌట్మ్యాచ్‌(క్వార్టర్ఫైనల్స్లు మార్చిన 23 నుంచి ప్రారంభమవుతాయి.

గ్రూప్‌-బిలో భారత్‌..

భారత జట్టుకు గ్రూపు-బిలో చోటు దక్కింది. ఈ గ్రూప్‌లో భారత్‌తో పాటు దక్షిణాఫ్రికా, ఇంగ్లండ్‌, వెస్టిండీస్‌, బంగ్లాదేశ్‌, ఐర్లాండ్‌, నెదర్లాండ్స్‌ జట్లు ఉన్నాయి. గ్రూప్‌-బిలో డిఫెండింగ్‌ చాంపియన్‌ ఆస్ట్రేలియా, మాజీ చాంపియన్లు శ్రీలంక, పాకిస్తాన్‌లతోపాటు న్యూజిలాండ్‌, జింబాబ్వే, కెనడా, కెన్యా జట్లు ఉన్నాయి. పాకిస్తాన్‌ తన అన్ని లీగ్‌ మ్యాచ్‌లను శ్రీలంకలోనే ఆడనుంది. భారత్‌లో ఆడేందుకు పాక్‌ ఆసక్తి కనబరచక పోవడంతో ఆ మ్యాచ్‌లను లంకకు కేటాయించారు. కాగా, ప్రపంచకప్‌లో శ్రీలంక మొత్తం 12 మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనుంది. దీనిలో ఒక సెమీస్‌, ఒక క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌ ఉంది. మరోవైపు బంగ్లాదేశ్‌ ఆరు మ్యాచ్‌లకు వేదికగా నిలువనుంది. దీనిలో రెండు క్వార్టర్‌ ఫైనల్‌ మ్యాచ్‌లు కూడా ఉన్నాయి. భారత్‌కు అత్యధిక సంఖ్యంలో 29 మ్యాచ్‌లు దక్కాయి. ఢిల్లిd, బెంగళూర్‌, మొహాలి, అహ్మదాబాద్‌, నాగ్‌పూర్‌, ముంబై, కోల్‌కతా, బెంగళూర్‌, చెన్నై నగరాలు వరల్డ్‌కప్‌ మ్యాచ్‌లకు ఆతిథ్యం ఇవ్వనున్నాయి. కాగా, భారత్‌-ఇంగ్లండ్‌ జట్ల మధ్య ఫిబ్రవరి 27న కోల్‌కతాలోని ఈడెన్‌ గార్డెన్‌లో జరగాల్సిన మ్యాచ్‌ను బెంగళూర్‌కు మార్చారు. సకాలంలో ఏర్పాట్లు పూర్తి చేయక పోవడంతో ఐసిసి ఈడెన్‌ నుంచి వేదికను బెంగళూర్‌కు మార్చింది. అయితే ఈడెన్‌లో జరగాల్సిన మిగతా మూడు మ్యాచ్‌ షెడ్యూల్‌ ప్రకారం అక్కడే జరుగుతాయి.

మూడోసారి...

ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇవ్వడం భారత్‌కు ఇది మూడోసారి. గతంలో 1987లో పాకిస్తాన్‌తో కలిసి భారత్‌ ప్రపంచకప్‌ను నిర్వహించింది. ఇంగ్లండ్‌ తర్వాత వరల్డ్‌కప్‌ నిర్వహించే అవకాశం భారత్‌, పాక్‌లకు దక్కింది. ఈ ప్రపంచకప్‌కు రిలయన్స్‌ సంస్థ స్పాన్సర్‌గా నిలిచింది. దీంతో కప్‌ను రిలయన్స్‌ ట్రోఫీ పేరిట నిర్వహించారు. ఫైనల్‌ మ్యాచ్‌ భారత్‌లోని ఈడెన్‌ గార్డెన్‌లో జరిగింది. దీనిలో ఆస్ట్రేలియా విజేతగా నిలిచింది. మరోవైపు 1995-96లో కూడా భారత్‌ ప్రపంచకప్‌కు ఆతిథ్యం ఇచ్చింది. ఈసారి భారత్‌, పాక్‌లతోపాటు శ్రీలంక కూడా ఆతిథ్యం పాలుపంచుకొంది. ఈ ప్రపంచకప్‌లో శ్రీలంక విజేతగా నిలిచింది. తాజాగా ఈ ఏడాది మరోసారి ఉపఖండంకు ప్రపంచకప్‌ నిర్వహించే అవకాశం దక్కింది. భారత్‌, శ్రీలంక, పాకిస్తాన్‌, బంగ్లాదేశ్‌లు సంయుక్తంగా ఈ టోర్నీని నిర్వహించాల్సి వచ్చింది. అయితే పాకిస్తాన్‌లో పరిస్థితులు అల్లకల్లోలంగా ఉండడంతో అక్కడ ఆడేందుకు మిగతా దేశాలు నిరాకరించాయి. దీంతో ఐసిసి పాక్‌ను టోర్నీ నిర్వాహణ బాధ్యత నుంచి తప్పించింది. అక్కడ జరగాల్సిన మ్యాచ్‌లను భారత్‌లో నిర్వహించాలని ఐసిసి నిర్ణయించింది. దీనికి మిగతా సభ్య దేశాలు అంగీకరించాయి.

అభిమానుల్లో ఉత్సాహం..

ఉప ఖండంలో ప్రపంచకప్‌ జరుగనుండడంతో ఆతిథ్య దేశాల్లో క్రికెట్‌ సందడి ప్రారంభమైంది. ముఖ్యం గా భారత్‌, బంగ్లాదేశ్‌లలో సందడి ఎక్కువగా కనిపిస్తోంది. టోర్నీ ప్రారంభానికి మరికొన్ని రోజులు మాత్రమే ఉండడంతో ప్రధాన నగరాల్లో పండగ వాతావరణం కనిపిస్తోంది. ఎక్కడ చూసిన క్రికెట్‌కు సంబంధించిన చర్చలే. ఫలానా జట్టు గెలుస్తోందని అప్పుడే అభిమానులు జోస్యం చెప్పడం ప్రారంభించారు. కొంతకాలంగా నిలకడగా రాణిస్తున్న టీమిండియాపై అభిమానులు భారీ ఆశలే పెట్టుకున్నారు. వారి ఆశలను మోస్తూ క్రికెటర్లు కూడా మెరుగైన ఆటను కనబరిచేందుకు సిద్ధంగా ఉన్నారు. అయితే రికార్డు స్థాయిలో ఆరో ప్రపంచకప్‌ ఆడనున్న మాస్టర్‌ బ్యాట్స్‌మన్‌ సచిన్‌ టెండూల్కర్‌పై అందరి దృష్టి నిలిచింది. రెండు దశాబ్దాల సుదీర్ఘ క్రికెట్‌ కెరీర్‌లో సచిన్‌కు ప్రపంచకప్‌ ట్రోఫీ అందని ద్రాక్షగానే ఉంది. కనీసం చివరి టోర్నమెంట్‌లోనైనా జట్టుకు ట్రోఫీని అందించాలనే లక్ష్యంతో మాస్టర్‌ ఉన్నాడు.