Sunday, May 13, 2012

రవితేజ రీమేక్ సినిమాలే ‘కిక్’



మాస్ రాజా రవితేజ సినిమాలపై ఇతర భాషల మూవీ మేకర్స్ మోజు పడుతున్నారు. దాంతో రవితేజ సినిమాలు వరుసగా రీమేక్ అవుతున్నాయి. రవితేజ హిట్ మూవీ విక్రమార్కుడు చిత్రం హిందీలో రౌడీరాథోర్ టైటిల్ తో రీమేక్ అవుతోంది. ప్రభుదేవా దర్శకత్వంలో అక్షయ్  కుమార్ హీరోగా చేస్తున్నాడు. విడుదలకు ముందే బాలీవుడ్ ఈ మూవీ భారీ అంచనాలు తీసుకువస్తోంది.
ఇక రవితేజ నటించిన మరో సినిమా కిక్ పై కూడా ఇతర భాషల వారి కన్నుపడింది. రవితేజ, ఇలియానా కాంబినేషన్ లో సురేంద్ర రెడ్డి రూపొందించిన కిక్ తెలుగులో సూపర్ హిట్టయింది. ఈ సినిమాలో రవితేజ యాక్టింగ్ అదిరిపోయింది. ఈ సినిమా ఇప్పుడు కన్నడంలో రీమేక్ అవుతోంది. కన్నడ రీమేక్ లో ఇంద్రజిత్ లోకేష్ దర్శకత్వంలో ఉపేంద్ర హీరోగా నటించటానికి రెడీ అవుతున్నాడు. గతంలో ఉపేంద్ర-ఇంద్రజిత్ కాంబినేషన్లో ఐశ్వర్య అనే సినిమా వచ్చింది. ఇది తెలుగులో నాగార్జున నటించిన మన్మథుడు రీమేక్ గా రూపొందించారు. ఈ సినిమా కూడా అక్కడ మంచి విజయం సాధించింది. అలాగే గతంలో రవితేజ చేసిన కృష్ణ సినిమా రీమేక్ లో కూడా హీరోగా ఉపేంద్ర చేశాడు. అదే సినిమాను తెలుగులో రజినీ ఫ్రం రాజమండ్రి పేరుతో తెలుగులోకి డబ్ చేశారు.
ఇక ప్రస్తుతం ఉపేంద్ర మంచి జోష్ మీదున్నాడు. ఉపేంద్ర లేటెస్ట్ మూవీ కఠారి వీర..సుర సుందరాంగి హిట్ టాక్ సొంతం చేసుకుంది. కన్నడ మొదటి త్రీడీ గా రూపొందిన ఈ చిత్రం రొమాంటిక్ ఫాంటసీ గా చెప్తున్నారు. మంచి జోష్ మీదున్న ఉపేంద్ర మరోసారి రవితేజ కిక్ సినిమాతో మరో హిట్ కొట్టాలని భావిస్తున్నాడు.

drusyam.net 

Wednesday, February 8, 2012

జగన్ ను చెక్కిన శిల్పులెవరు ?


2004 అసెంబ్లీ ఎన్నికలకు ముందు.. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రతిపక్ష నేతగా రాష్ట్రంలో ప్రతి ఒక్కరికి సుపరిచితులు. ఆయన తనయుడు జగన్ అనే విషయం రాజకీయ వర్గాల్లో చాలా మందికి తెలుసు. కాని అతడిలో దమ్మెంతుంది..

రీడ్ మోర్...

http://drusyam.net/

Sunday, June 5, 2011

అలుపెరగని సుదీర్ఘ బాటసారి..మూవీ మొఘల్‌

ఆయన చదివింది సినిమా. ఆయనకు తెలిసింది సినిమా. అందుకే ఆయన మూవీ మొఘల్అయ్యారు. గిన్నిస్బుక్లో చోటు సంపాదించారు. నటరత్న ఎన్టీఆర్దగ్గర్నుంచి ఇప్పటి అల్లరి నరేశ్వరకు ఎంతోమందితో సినిమాలు నిర్మించారు. మరెంతో మందిని వెండితెరకు పరిచయం చేశారు. ఆయనే శతాధిక చిత్రాల నిర్మాత డాక్టర్డి. రామానాయుడు. ఇలా ఎన్నో కీర్తి శిఖరాలను అధిరోహించి నేటితో 75 వసంతాలు పూర్తి చేసుకుని 76 ఏట అడుగుపెడుతున్నారు.

మూవీమెఘల్‌గా తెలుగు సినీ పరిశ్రమలో తిరుగులేని వ్యక్తి డాక్టర్‌ డి. రామానాయుడు. సినిమా ప్రపంచంలోకి వెళ్ళాలని కోరికతో స్వయంగా సినిమా నిర్మాణాన్ని చేపట్టాలని భావించారు రామనాయుడు. తొలుత కో-ప్రోడ్యూసర్‌గా మరోకరితో కలిసి అనురాగం అనే సినిమాను నిర్మించారు. ఇక ఆ తరువాత సొంత నిర్మాణం సురేశ్‌ ప్రొడక్షన్స్‌ సంస్థను స్థాపించి తొలి చిత్రమే ఎన్టీఆర్‌ హీరోగా తీశారు. రాముడు-భీముడుగా ఎన్టీఆర్‌ను డ్యూయల్‌ రోల్‌లో చూపించి ఫస్ట్‌ మూవీతోనే సూపర్‌ సక్సెస్‌ను సాధించారు. అయితే ఆ ఫస్ట్‌ హిట్‌ మూవీని రీమేక్‌ చేయాలన్న కోరికతో ఉన్నారు రామానాయుడు.

రాముడు భీముడు భారీ హిట్‌ తర్వాత వెనుతిరిగి చూసుకోలేదు రామానాయుడు. ఎన్టీఆర్‌తో అయన తీసిన మరో చిత్రం శ్రీకృష్ణ తులాభారం. ఈ పౌరణికం ప్రేక్షకులను బాగా అలరించింది.

పట్టుదలనే అస్త్రంగా చేసుకుని మరికొన్ని సినిమాలకు శ్రీకారం చుట్టారు రామానాయుడు. ఆ సమయం కొన్ని సినిమాలు వరుసగా ప్లాప్‌ అయ్యాయి. అప్పుడు సినీ పరిశ్రమలో ఎన్టీఆర్‌ ఆయనకు నైతిక మద్దతునిచ్చారు. ఆ డూ ఆర్‌ డై పొజిషన్‌లో రామానాయుడు తీసిన చిత్రం "ప్రేమనగర్". అక్కినేని నాగేశ్వరరావు నటించిన ఈ మూవీ రామానాయుడికి ఎంతో కీర్తి ప్రతిష్టల్నీ సంపాదించి పెట్టింది. తెలుగు సినీ చరిత్రలో ఇదొక మైలురాయిలా నిలిచిపోయింది.

ఆ తర్వాత రామానాయుడి ఖాతాలో చేరిన మరో బ్లాక్‌ బస్టర్‌ మూవీ దేవత. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో శోభన్‌బాబు, మోహన్‌బాబు, శ్రీదేవి, జయప్రద ప్రధాన పాత్రల్లో వచ్చిన మూవీ అప్పట్లో ఫ్యామిలీ ప్రేక్షకులను బాగా అలరించింది.

ఇప్పటి వరకు రామానాయుడు నిర్మించిన సినిమాల సంఖ్య నూట పాతిక. ఇందులో 75 తెలుగు సినిమాలు, 19 హిందీ సినిమాలు, 24 తమిళ చిత్రాలు, బెంగాలీలో రెండు సినిమాలు, రెండు కన్నడ చిత్రాలు, ఓరియా, అస్సామి భాష చిత్రాలు కూడా ఉన్నాయి.

నిర్మాత సక్సెసయిన రామానాయుడు తన వారసులను వెండితెరకు పరిచయం చేశారు. తనయుడు సురేష్‌బాబు నిర్మాతగా, హీరోగా వెంకటేష్‌, రీసెంట్‌గా మనవడు రానా.. తమ తమ సినిమాలతో బిజీబిజీగా ఉన్నారు.

తన వారసులనే కాదు ఎంతోమందిని సిల్వర్‌ స్క్రీన్‌కు ఇంట్రడ్యూస్‌ చేసిన క్రెడిట్‌ కూడా రామానాయుడిదే. ఆరుగురు హీరోలు, 12 మంది హీరోయిన్లు, 21 మంది దర్శకులను, 7 గురు మ్యూజిక్ కంపోజర్లు... మరెంతో మంది క్యారెక్టర్‌ ఆర్టిస్టులను సినీ రంగానికి తీసుకొచ్చిన ఘనత రామానాయుడుది. అంతేకాదు. పాతికేళ్ళుగా తెలుగు ప్రేక్షకులను నవ్వుల సాగరంలో ముంచేస్తున్న బ్రహ్మనందాన్ని సిల్వర్‌ స్క్రీన్‌కు ఇంట్రడ్యూస్‌ చేసింది కూడా ఆయనే.

ఇక సినిమాలను ఏదో ఊరికే తీయడం అంటే ఆయనకు నచ్చదు. దర్శకులకు పూర్తి స్వేచ్చనిచ్చే ఆయన... నిర్మాతగా అనేక సూచనలిస్తారు. తన అభిరుచులను సినిమాల్లో ఉండేలా చూసుకుంటారు. ఒక విధంగా చెప్పాలంటే అదే ఆయన్ను విజయవంతమైన నిర్మాతగా నిలబెట్టింది. సినిమా పట్ల ఆయన తీసుకునే ప్రత్యేకమైన శ్రద్ధే సినిమా విజయానికి కారణమని ఆయన దగ్గర పనిచేసిన చాలా మంది దర్శకులు అనేక సందర్భాల్లో చెబుతుంటారు.

సినిమాలే తన ప్రపంచంగా మార్చుకున్న ఆయన ఈ రంగంలో అనేక రికార్డులు సాధించారు. అందులో చెప్పుకోవాల్సింది గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డ్‌. తెలుగు ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది సాధించిన ఈ ఘనతలో రామానాయుడు ఒకరు. దేశంలో సినీప్రముఖులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్‌ ఫాల్కే అవార్డు సాధించిన ఘనత కూడా మూవీ మెగల్‌ది.

ఇక వ్యక్తి గతంగానూ ఆయన చేసిన సేవలకు అనేక గౌరవాలు దక్కాయి. ఇక సినీ రంగానికే కాదు తన ఎదుగుదలకు తొడ్పడ్డ ప్రేక్షకులకు, ప్రజలకు కూడా సేవ చేస్తున్న వ్యక్తి రామానాయుడు. రాజకీయాల్లో వచ్చి సేవ చేయడంతో పాటు ట్రస్ట్‌ ద్వారా తన సొంత డబ్బులో అనే సేవా కార్యక్రమాలు నిర్వహించారాయన.

రామానాయుడు నాలుగు దశాబ్ధాలుగా తెలుగు సినీ పరిశ్రమను చూస్తున్నారు. తనదైన స్టైల్లో సినిమాలను చూపిస్తున్నారు. అగ్రతారలందరితో సినిమాలు తీసిన ఆయన వారి స్టార్‌ డమ్‌ను మరింతగా పెంచారు.

ఓ రాముడు భీముడు, ఓ ప్రేమ్‌నగర్‌, ఓ సొగ్గాడు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సూపర్‌ హిట్‌ చిత్రాలు... ఇవన్నీ ఆయన సారధ్యంలోనే వచ్చాయి. ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. నాలుగు దశాబ్దలుగా సినీ వినీలాకాశంలో హీరోలకు, దర్శకులకు ధీటుగా స్టార్‌ ప్రొడ్యూసర్‌గా కొనసాగుతున్న వ్యక్తి ఒక్క రామానాయుడు మాత్రమే అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు.

అయన అలుపెరగని సుదీర్ఘ బాటసారి.. ఎవ్వరు సాధించలేని ప్రపంచరికార్డులు ఒంటి చేత్తో సాధించగల నేర్పరి.. హిట్‌ సాధించేంతవరకు నిద్దురపోని గడుసరి.. ఆ మూవీమొఘల్‌కు బర్త్‌ డే విషెస్‌ అందిద్దాం.

-స్వామి ముద్దం


Friday, June 3, 2011

స్టార్ హీరోల శివతాండవం

స్టార్‌ హీరోలు శివతాండవం చేస్తున్నారు. మొన్న చిరంజీవి.. నిన్న మహేష్‌, పవన్‌, ఇప్పుడు అల్లుఅర్జున్ తమ సినిమాల్లో శివ నామస్మరణ వినిపిస్తున్నారు. తాజాగా నాగార్జున శివ నామస్మరణతో డమరుకం మోగించబోతున్నాడు.


శివుని పాటలు స్టార్‌ హీరోల సినిమాలకు కొత్త జోష్‌ తీసుకువస్తున్నాయి. మెగాస్టార్‌ చిరంజీవి నటించిన ఇంద్రలో శివుని పాట ఉంది. భం భం భోలే అంటూ వారణాసిలో జోరుగా ఆడిపాడాడు మెగాస్టార్‌.

ప్రిన్స్‌ మహేష్‌ కూడా తన సినిమాలో శివుని పాట పెట్టుకున్నాడు. సదా శివ అంటూ సాగే ఖలేజాలోని సాంగ్‌ సినిమాకే హైలెట్‌గా నిలిచింది.

ఇటీవల వచ్చిన పవన్‌ కళ్యాణ్‌ తీన్‌మార్‌లోనూ శివుని సాంగ్‌ ఉంది. జగమేలు శివశంకరా.. అంటూ శివున్ని తలుచుకున్నాడు పవర్‌స్టార్‌.

ఇక బద్రినాథ్‌లోనూ ఓం కారేశ్వరీ అంటూ ఓ భక్తిగీతం ఉంది. బద్రినాథ్‌ నేపథ్యంలో సాగిన ఈ పాటలో అల్లుఅర్జున్‌ జోష్‌గా స్టెప్పులేశాడు.

ఇక నాగార్జున తన కొత్త సినిమా డమరుకంలో కూడా శివుని సాంగ్‌ పెట్టబోతున్నారట. శ్రీనివాస్‌ రెడ్డి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సోషియో ఫాంటసీ చిత్రం శివుని నేపథ్యంతో సాగనుందని తెలుస్తోంది.

ఇలా శివుని పాటలపై టాలీవుడ్‌ స్టార్‌ హీరోలు మోజు పడుతున్నారు. శివనామస్మరణ చేస్తునేవున్నారు.

Sunday, May 22, 2011

ఓ వెన్నెల.. ఓ వేకువ.. ఓ వేటూరి..

ఆకుచాటు తడిసిన పిందెలా.. ఆరేసుకోబోయి పారేసుకున్న జరీ చీర జిలుగులా.. రవివర్మకు అందని అందాల్ని అందించిన భావకుడిలా.. పదాల్నితాకి కవితా గౌతమిని ప్రవహింప చేసిన భగీరధుడిలా.. చల్లగాలిలా.. మల్లెపూవులా.. ఒక చిన్న మాటతో అనంత రాగాల్ని పలికించిన వీణలా.. కొమ్మకొమ్మకో సన్నాయిలా.. ఝమ్మన్న నాదంలా.. .. వేణువైన భువనంలా.. గాలిలో కలసిన గగనంలా.. తెలుగు అలంకారాలతో చెడుగుడు ఆడుకున్న మరపు రాని రచయిత వేటూరి.

సింధూర వర్ణాలు తెల్లారి చల్లారిపోగా

తిరిగే భూమాతవు నీవైవేకువలో వెన్నెలవై

కరిగే కర్పూరము నీవైఆశలకే హారతివై

వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే

లోకమెన్నడో చీకటాయెలే.. అంటూ అద్భతమైన తన కవనంతో

శ్రీశ్రీ తర్వాత తెలుగు సినిమా పాటకి జాతీయ ఉత్తమ సినిమా పాటల రచయిత పురస్కారాన్ని అందించారు వేటూరి.

సీత కధతో సినీ ప్రస్థానం ప్రారంభించిన వేటూరి.. సంగీత దర్శకుల బాణీలకు రంగురంగుల పదాల వోణీలు కట్టారు. పాటకు పైటేసి సిగ్గుల మెగ్గని చేసారు. అడవి రాముడు, శంకరాభరణం. ఇంకా సిరిసిరిమువ్వ, సాగరసంగమం, సప్తపది, సీతాకోకచిలుక, ముద్దమందారం, సితార, అన్వేషణ, స్వాతిముత్యం... ఎన్నో సినిమాలు... అజరామరమైన గీతాలు.. ఆయన కలం నుంచి జాలువారాయి.

పండితుల్ని పామరుల్ని సరిసమానంగా అలరించిన కవి వేటూరి. ఆయనో ఆధునిక శ్రీనాధుడు. పగలంతా బాధించే దిగుల్ని.. రేయింతా వేధించే సెగల్ని వేటూరిలా చెప్పగల కవులు చాలా అరుదు.

గోదావరికి వేటూరికి ఏదో అవినాభావ సంబంధం. ఎప్పుడు వెన్నెలని.. వెన్నల్లో తడిసి ముద్దయిన గోదావరిని చూసినా ఆయన కలం ఉరకలేస్తుంది. వెన్నల్లో గోదారి అందాన్ని అంత అద్భుతంగా చెప్పిన వాడు వేటూరి.

హృదయ గాయాలకి మృదుగేయ ఔషధాలను ఆర్పించిన వాక్య వైద్యుడు వేటూరి. ఆత్రేయలోని భావసౌందర్యాన్ని, సి.నారాయణరెడ్డిలోని భాషా పటిమనుశ్రీశ్రీ లోని సామాజిక చైతన్య స్ఫూర్తిని రంగరించి రూపుదాల్చిన మూర్తివేటూరి సుందరరామమూర్తి. తెలుగు పాటల పూదోటలో కొమ్మకొమ్మకో సన్నాయి పలికించి.. రాలేటి పూలతో రాగాలు పలికించిన చరితార్ధుడు వేటూరి. ప్రియా ప్రియతమా అంటూ ఎప్పుడూ గుండెల్లో ధ్వనిస్తూనే ఉంటాడు.

ఆధునిక సినీకవిత్రయం ఎవరంటే ఆత్రేయ.. శ్రీశ్రీ.. వేటూరి.. అని చెప్పుకోవచ్చు. పద లాలిత్యంలోనూ.. భావ వైవిధ్యంలోనూ.. ముగ్గుర్లో ఎన్నో పోలికలు.. సామీప్యతలూ ఉన్నాయి. ముగ్గురి అవసానదశ దాదాపు ఒకే రకంగా గడచింది.

కొమ్మలు రెమ్మలు గొంతే విప్పిన కొత్త పూల మధుమాసంలో

తుమ్మెద జన్మకు నూరేళ్ళెందుకు రోజే చాలులే

చింత పడే చిలిపి చిలకా చిత్రములే బ్రతుకు నడకా

పుట్టే ప్రతి మనిషి కనుమూసే తీరు.. అంటూ వేదాంతాన్ని ప్రేమని మానవత్వాన్ని రంగరించి రాగంలా మార్చిన వేటూరి చిరస్మరనీయుదు.

ఈ మజిలీ మూడు నాళ్ళే ఈ జీవయాత్రలోఒక పూటలొనె రాలు పూవులెన్నో అంటూ వేదాంతిలా వెళ్ళిపోయిన వేటూరి.. మనకు తన ఙ్ఞాపకాలు.. పాటలు.. మిగిల్చివెళ్ళారు. వెన్నెల్ని.. వేకువని.. వేటూరిని ఎలా మరిచిపోగలం..

(ఈ రోజు వేటూరి వర్థంతి సందర్భంగా)