Sunday, May 22, 2011

ఓ వెన్నెల.. ఓ వేకువ.. ఓ వేటూరి..

ఆకుచాటు తడిసిన పిందెలా.. ఆరేసుకోబోయి పారేసుకున్న జరీ చీర జిలుగులా.. రవివర్మకు అందని అందాల్ని అందించిన భావకుడిలా.. పదాల్నితాకి కవితా గౌతమిని ప్రవహింప చేసిన భగీరధుడిలా.. చల్లగాలిలా.. మల్లెపూవులా.. ఒక చిన్న మాటతో అనంత రాగాల్ని పలికించిన వీణలా.. కొమ్మకొమ్మకో సన్నాయిలా.. ఝమ్మన్న నాదంలా.. .. వేణువైన భువనంలా.. గాలిలో కలసిన గగనంలా.. తెలుగు అలంకారాలతో చెడుగుడు ఆడుకున్న మరపు రాని రచయిత వేటూరి.

సింధూర వర్ణాలు తెల్లారి చల్లారిపోగా

తిరిగే భూమాతవు నీవైవేకువలో వెన్నెలవై

కరిగే కర్పూరము నీవైఆశలకే హారతివై

వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే

లోకమెన్నడో చీకటాయెలే.. అంటూ అద్భతమైన తన కవనంతో

శ్రీశ్రీ తర్వాత తెలుగు సినిమా పాటకి జాతీయ ఉత్తమ సినిమా పాటల రచయిత పురస్కారాన్ని అందించారు వేటూరి.

సీత కధతో సినీ ప్రస్థానం ప్రారంభించిన వేటూరి.. సంగీత దర్శకుల బాణీలకు రంగురంగుల పదాల వోణీలు కట్టారు. పాటకు పైటేసి సిగ్గుల మెగ్గని చేసారు. అడవి రాముడు, శంకరాభరణం. ఇంకా సిరిసిరిమువ్వ, సాగరసంగమం, సప్తపది, సీతాకోకచిలుక, ముద్దమందారం, సితార, అన్వేషణ, స్వాతిముత్యం... ఎన్నో సినిమాలు... అజరామరమైన గీతాలు.. ఆయన కలం నుంచి జాలువారాయి.

పండితుల్ని పామరుల్ని సరిసమానంగా అలరించిన కవి వేటూరి. ఆయనో ఆధునిక శ్రీనాధుడు. పగలంతా బాధించే దిగుల్ని.. రేయింతా వేధించే సెగల్ని వేటూరిలా చెప్పగల కవులు చాలా అరుదు.

గోదావరికి వేటూరికి ఏదో అవినాభావ సంబంధం. ఎప్పుడు వెన్నెలని.. వెన్నల్లో తడిసి ముద్దయిన గోదావరిని చూసినా ఆయన కలం ఉరకలేస్తుంది. వెన్నల్లో గోదారి అందాన్ని అంత అద్భుతంగా చెప్పిన వాడు వేటూరి.

హృదయ గాయాలకి మృదుగేయ ఔషధాలను ఆర్పించిన వాక్య వైద్యుడు వేటూరి. ఆత్రేయలోని భావసౌందర్యాన్ని, సి.నారాయణరెడ్డిలోని భాషా పటిమనుశ్రీశ్రీ లోని సామాజిక చైతన్య స్ఫూర్తిని రంగరించి రూపుదాల్చిన మూర్తివేటూరి సుందరరామమూర్తి. తెలుగు పాటల పూదోటలో కొమ్మకొమ్మకో సన్నాయి పలికించి.. రాలేటి పూలతో రాగాలు పలికించిన చరితార్ధుడు వేటూరి. ప్రియా ప్రియతమా అంటూ ఎప్పుడూ గుండెల్లో ధ్వనిస్తూనే ఉంటాడు.

ఆధునిక సినీకవిత్రయం ఎవరంటే ఆత్రేయ.. శ్రీశ్రీ.. వేటూరి.. అని చెప్పుకోవచ్చు. పద లాలిత్యంలోనూ.. భావ వైవిధ్యంలోనూ.. ముగ్గుర్లో ఎన్నో పోలికలు.. సామీప్యతలూ ఉన్నాయి. ముగ్గురి అవసానదశ దాదాపు ఒకే రకంగా గడచింది.

కొమ్మలు రెమ్మలు గొంతే విప్పిన కొత్త పూల మధుమాసంలో

తుమ్మెద జన్మకు నూరేళ్ళెందుకు రోజే చాలులే

చింత పడే చిలిపి చిలకా చిత్రములే బ్రతుకు నడకా

పుట్టే ప్రతి మనిషి కనుమూసే తీరు.. అంటూ వేదాంతాన్ని ప్రేమని మానవత్వాన్ని రంగరించి రాగంలా మార్చిన వేటూరి చిరస్మరనీయుదు.

ఈ మజిలీ మూడు నాళ్ళే ఈ జీవయాత్రలోఒక పూటలొనె రాలు పూవులెన్నో అంటూ వేదాంతిలా వెళ్ళిపోయిన వేటూరి.. మనకు తన ఙ్ఞాపకాలు.. పాటలు.. మిగిల్చివెళ్ళారు. వెన్నెల్ని.. వేకువని.. వేటూరిని ఎలా మరిచిపోగలం..

(ఈ రోజు వేటూరి వర్థంతి సందర్భంగా)

Wednesday, May 11, 2011

రజినీకాంత్ సినిమా ఇప్పట్లో లేనట్టేనా?


ఇప్పుడు అందరి దృష్టి సూపర్‌స్టార్‌ రజినీకాంత్‌పైనే. ఆయన ఆరోగ్యం ఇప్పటికీ అలాగే ఉందా? కొత్త సినిమా 'రాణా' షూటింగ్‌కు ఆయన ఆరోగ్యం అడ్డంకిగా మారిందా? అసలు ఇప్పట్లో రజినీ సినిమా లేనట్లేనా?

సూపర్‌స్టార్ రజనీకాంత్ అనారోగ్యం కారణంగా.. ఆయన కొత్త సినిమా రాణా చిక్కుల్లో పడే అవకాశం ఉందని పరిశ్రమ వర్గాలు అంటున్నాయి. రజనీ అనారోగ్యం కారణంగా రాణా మూవీ షూటింగ్ అనుకున్న షెడ్యూల్ ప్రకారం జరగడం లేదు. కొద్ది రోజులు అనారోగ్యం కారణంగా చెన్నైలోని ఓ ఆస్పత్రిలో చికిత్స పొంది డిశ్చార్జ్ అయ్యారు రజినీ. అనారోగ్యం నుంచి రజనీ కోలుకుంటున్నప్పటికీ, షూటింగ్‌లో ఇప్పుడే పాల్గొనకూడదని డాక్టర్లు చెప్పినట్టు తెలుస్తోంది. అంతేకాదు అతడిని అమెరికాలోని స్పెషలిస్ట్‌లకు డాక్టర్లు సూచించినట్లు సమాచారం. ఈ మేరకు ఆయన రజినీ ఫ్యామిలీ డాక్టర్లతో చర్చిస్తున్నట్లు తెలుస్తోంది.
చికిత్సకోసం రజనీ త్వరలోనే అమెరికాకు వెళ్లే అవకాశాలు కూడా ఉన్నాయంటున్నారు. ఫలితంగా రాణా షెడ్యూల్ మరింత ఆలస్యం అయ్యే అవకాశం ఉందని యూనిట్ భావిస్తోంది.
ప్రతిష్టాత్మకంగా మొదలు పెట్టిన రాణా సినిమాలో రజనీ మూడు గెటప్పుల్లో నటిస్తున్నాడు. అందులో ఓ పాత్ర పవర్‌ఫుల్‌గా ఉంటుంది. రోల్ చేయాలంటే ఎంతో ఫిజికల్ ఎనర్జీ కావాలి. ఈ నేపథ్యంలో ఆ పాత్ర చేసేందుకు రజినీ ఆరోగ్యం ఎంత వరకు సహకరిస్తుందనేది ఇప్పుడు అందరిని వేధిస్తున్న ప్రశ్న.


రాణా షూటింగ్‌ ప్రారంభమైన తొలి రోజే రజినీ అస్వస్థతకు గురయ్యాడు. కోలుకున్న కొద్ది రోజులకే మళ్లీ అదే పరిస్థితి. అసలు రాణా సినిమాకే రజినీ ఆరోగ్యం ఎందుకు ఇలా ఇబ్బంది పెడుతోంది? అప్పుడు అందరికి వస్తున్న డౌట్‌ ఇదే. రజినీ చేస్తున్న మూడు గెటప్పుల్లో ఒకటి యువకుని పాత్ర. ఆ పాత్ర కోసం రజినీ ఏకంగా పదిహేను కిలోలు తగ్గాల్సి వచ్చిందట. 75 కిలోలు ఉన్న రజినీ 60 కిలోలకు చేరాడంట. ఇదే ఆయన ఆరోగ్యానికి అసలు కారణంగా తెలుస్తోంది.

మరి ఈ పరిణామాల నేపథ్యంలో రాణా షూటింగ్‌‌కు తాత్కలికంగా బ్రేక్‌ పడే అవకాశాలున్నాయని చెన్నై ఫిల్మ్ వర్గాలు భావిస్తున్నాయి. సూపర్‌స్టార్‌ త్వరగా కోలుకుని మరింతా ఉత్సాహంగా సినిమా పూర్తిచేయాలని ఆయన అభిమానులు పూజలు చేస్తున్నారు. 'రోబో' కంటే రాణాతో మరింతా తమను అలరిస్తాడని సూపర్‌స్టార్‌ ఫ్యాన్స్ కాన్ఫిడెంట్‌గా ఉన్నారు.



Friday, March 25, 2011

మళ్ళీ ఆపాత మధురాలు

సినిమా పాట చంద్రోదయాలు... చల్లని సాయంత్రాలు.. వెన్నెల కాంతులు... వసంత రాత్రులు... అన్నీ చూసింది. ఇక ఇప్పుడు రీమిక్స్‌. పాట పల్లవిని అలాగే వుంచి.. చరణాలను కొత్తగా మార్చి సరికొత్తగా కంపోజ్‌ చేయడం రివాజైంది. పాట మొత్తాన్ని యథాతథంగా దింపేసిన సందర్భాలూ వుంటున్నాయి. ఈ ట్రెండ్‌ను ఇటీవలి కాలంలో బాగా ఫాలోఅవుతున్న హీరో పవన్‌కళ్యాణ్‌‌. ఇటీవలే ఆడియో ఫంక్షన్‌ జరుపుకుని రిలీజ్‌కు రెడీ అవుతున్న పవర్‌స్టార్‌ పవన్‌కళ్యాణ్‌ మూవీ తీన్‌మార్‌లోనూ రీమిక్స్‌ సాంగ్‌ ఉంది. ఓహోబస్తీ దొరసాని అలనాటి హిట్‌ సాంగ్‌ను మళ్ళీ గుర్తుకుతెచ్చింది.

1960లో అక్కినేని నాగేశ్వరరావు నటించిన అభిమానం చిత్రంలోనిది ఈ పాట. ఘంటసాల-జిక్కి పాడిన ఈ పాటను ఆరుద్ర రాశారు.


పవన్‌కళ్యాణ్‌ మరో సినిమా ఖుషీలోనూ ఓ సాంగ్‌ను రీమిక్స్‌ చేశారు. పవన్‌కళ్యాణ్‌-భూమికపై చిత్రించిన ఆడువారి మాటలకు అర్థాలే అంటూ సాగే ఈ సాంగ్‌ జనాన్ని అలరించింది.

1955లో వచ్చిన ఎవర్‌గ్రీన్ సినిమా 'మిస్సమ్మ'లోనిది ఈ పాట. ఎన్టీయార్‌, సావిత్రి అభినయించిన ఈ పాత పాటను నెమరేసుకోని సంగీతాభిమానులుండరు. సాలూరి రాజేశ్వరరావు గొప్పతనమది.


పవన్‌కళ్యాణ్‌ రీమిక్స్‌ చేసిన మరో పాట తానే డైరెక్ట్‌ చేసిన జానీలోనిది. ఈ రేయితీయనిది అంటూ సాగుతుందీ పాట. ఈ పాట చిట్టిచెల్లెలు సినిమాలోని ఈ రేయి తీయనిది పాటను వాడుకున్నాడు.


భీమవరంబుల్లోడా పాలు కావాలా.. అంటూ ఇటీవలే వచ్చిన మూవీ రాజ్‌. సుమంత్‌, ప్రియమణి, విమలారామన్‌ కలిసి ఆడిపాడిన ఈ పాట మరోసారి ఆడియన్స్‌ను అలరించింది.

ఈ సాంగ్‌ ఘరానాబుల్లోడు నుంచి రీమీక్స్‌ చేసిన పాట. నాగార్జున-ఆమని స్టెప్పులేసిన ఈ పాట అప్పట్లో యూత్‌ను తెగ అట్రాక్ట్‌ చేసింది.


అల్లరి నరేష్‌ లేటెస్ట్‌ మూవీ ఆహా నా పెళ్ళంటలోనూ వచ్చిన రీమిక్స్‌ పాట అందరిని అలరిస్తోంది. ఈ సినిమాకి ఈ పాట హైలెట్‌గా నిలిచింది.

ఈ పాట 1982లో వచ్చిన జంధ్యాల సినిమానాలుగు స్తంబాలాటలోనిది. వేటూరి రాసిన ఈ పాటకు రాజన్‌-నాగేంద్ర మ్యూజిక్ అందించారు.


ఇలా అలనాటి హిట్‌ పాటలను రీమిక్స్‌ చేయడంతో సినిమాకు కూడా ప్లస్‌ పాయింట్‌ అవుతోంది. అందుకే కొత్త సినిమాలు ఆ సూత్రాన్ని పాటిస్తూనే వున్నాయి. ఏమైనా అలనాటి మధుర గీతాలను మళ్ళీ మనం ఆస్వాదిస్తూనే ఉన్నాము.





Friday, March 18, 2011

దాసరి.. కౌన్‌ బనేగా ముఖ్యమంత్రి


దాసరి నారాయణరావు మరోసారి బాలీవుడ్‌లో ఓ పొలిటికల్‌ మూవీని తెరకెక్కించబోతున్నాడు. 
సంజయ్‌దత్‌ హీరోగా కౌన్‌ బనేగా ముఖ్యమంత్రి పేరుతో హిందీలో సినిమా
చేయబోతున్నాడు దాసరి
.

పొలిటికల్‌ సినిమాలు తీయడంలో సిద్ధహస్తుడు దాసరి నారాయణరావు.
సిల్వర్‌ స్ర్కీన్‌‌పై తాజా రాజకీయాల గురించి తనదైన శైలిలో సెటైర్లు విసురుతాయాన
.
తెలుగులోనే కాదు బాలీవుడ్‌లోనూ ఆయన ఓ పొలిటికల్‌ సినిమా రూపొందించారు
.
ఇరవై ఏడేళ్ళ క్రితం ఆజ్‌ కా ఎమ్మెల్యే టైటిల్‌తో రాజేష్‌ఖన్నాతో సినిమా తీశాడు దాసరి
.

తాజాగా దాసరి మరో పొలిటికల్‌ మూవీకి రెడీ అయ్యారు. ఈ సినిమా హిందీలో
తెరకెక్కించబోతున్నాడు
. సంజయ్‌దత్‌ హీరోగా కౌన్‌ బనేగా ముఖ్యమంత్రి పేరుతో ఈ సినిమాను
రూపొందించేందుకు ప్లాన్‌ జరుగుతున్నట్టు తెలుస్తోంది
. దాసరి మరోసారి పొలిటికల్‌ మూవీ రెడీ
అవుతుండటంతో ఇండస్ర్టీలో హాట్‌ టాపిక్‌గా మారింది
.

Saturday, March 12, 2011

మార్లిన్‌ మాన్రోగా ఐశ్వర్యారాయ్‌

బాలీవుడ్‌ బ్యూటీ ఐశ్వర్యారాయ్‌ హాలీవుడ్‌ అద్భుతం మార్లిన్‌ మాన్రోగా కనిపించబోతోంది. హాలీవుడ్‌ సెన్సేషనల్‌ సెక్సీ స్టార్‌ మార్లిన్‌ లైఫ్‌స్టోరీని మధూర్‌ భండార్కర్‌ తెరకెక్కించనున్నారు.

సెక్సీయెస్ట్‌ ప్రపంచంలో మార్లిన్‌ మన్రో ఒక శృంగార సంచలన కెరటం. తన నగ్న సౌందర్యాన్ని సెల్యూలాయిడ్ మీద పరిచి వరల్డ్‌వైడ్‌గా ఆడియన్స్‌ అట్రాక్ట్ చేసింది. 'జెంటిల్ మెన్ ప్రెఫెర్ బ్లాన్దీస్', 'ది సెవన్ ఇయర్ ఇచ్', 'సం లైక్ ఇట్ హాట్' వంటి సినిమాలతో సిల్వర్‌స్ర్కీన్‌ను మరింతా అందంగా అలంకరించింది.


చూపుతిప్పుకోలేని అందమైన శృంగారాన్ని వెండితెర మీద ఒలకబోసి జనాన్ని మాయ చేసింది మార్లిన్ . కేవలం 36 ఏళ్ళు మాత్రమే జీవించిన మార్లిన్‌.. దశాబ్దాలకు సరిపడ పేరు సంపాదించింది. చనిపోయి నలభై ఏళ్లవుతున్నా మార్లిన్‌ అందం ఇప్పటికీ ఎవర్‌గ్రీన్‌.


రీల్‌ లైఫ్‌లోనే కాదు రియల్‌లైఫ్‌లోనూ మార్లిన్‌ది సెన్సేషనల్‌ స్టోరీ. తన జీవితంలో మూడు సార్లు పెళ్ళి చేసుకుని, అమెరికా అధ్యక్ష్యుడు జాన్.ఎఫ్.కెన్నడీతో నూ ఆయన సోదరుడుతోనూ ఒకే సారి ఎఫైర్స్ నడిపి హాట్‌ టాపిక్‌గా మారింది. ఇప్పటికీ ఆమె ప్రణయగాధలు, శృంగార జీవితం, మరణం అన్నీ సంచలనాలే. అందుకే యధార్ధగాధలను తెరకెక్కించే దర్శకుడిగా పేరున్న మాధూర్‌ బండార్కర్‌ ... ఇప్పుడు మన్రో లైఫ్‌ను సిల్వర్‌స్ర్కీన్‌పై ఆవిష్కరించబోతున్నాడు.

అయితే మార్లిన్‌మన్రో పాత్ర కోసం బాలీవుడ్‌ బ్యూటీ ఐశ్వర్యరాయ్‌ని ఓకే చేసినట్టు తెలుస్తోంది. గతంలో ఈ ప్రాజెక్ట్‌లో మార్లిన్ మన్రోగా కరీనా కపూర్ అయితే బాగుంటుందని అనుకున్నారు. అయితే ఆమె ఆసక్తి చూపకపోవటంతో ఆ ఆఫర్ ..ఐశ్వర్యని వరించినట్టు తెలుస్తోంది. మార్లిన్‌ను గుర్తుకు తెచ్చే రూపం ఉండటంతో ఈ పాత్రకు ఐష్‌ సరిగ్గా
సరిపోతుందంటున్నారు
.


ఐశ్వర్య అంటే మాధుర్‌ బండార్కర్‌కి ప్రత్యేమైన అభిమానం ఉంది. దీంతో ఐష్‌కు తగినట్టుగానే ఈ సినిమా స్టోరీ తయారు చేశారని అంటున్నారు. అయితే ఈ విషయం బయటికి రాకుండా ఐశ్వర్యరాయ్ ఈ చిత్రంలో నటించడానికి సైన్‌ చేసిందట. మార్లిన్ మన్రోకు భారీగా సెక్సీ స్టార్‌ ఇమేజ్ ఉంది. స్ర్కీన్‌పై మర్లిన్‌ స్థాయిలో శృంగారం ఒలికించడానికి ఈ నీలికళ్ళ సుందరి సుముఖంగానే ఉండటం బాలీవుడ్ జనాన్ని ఆశ్చర్యపరుస్తోంది.

పేజ్ త్రీ, ఫ్యాషన్, చాందినీబార్ వంటి సినిమాలను రూపొందించిన మధూర్.. ఈ కొత్త సినిమాతో ఎటువంటి సంచలనం సృష్టించబోతున్నాడోనని సినీ జనాలు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.



తెహ్రీర్ నుంచి తెహ్రీర్ కు మళ్ళీ మళ్ళీ..

- ఒసామా హిజ్జి..


స్క్వేర్ ను చూసావా..

ప్రజలు ఎలా నిలబడ్డారో చూసావా..

జరిగింది మర్చిపోడానికి రక్తం ఎలా నిరాకరిస్తుందో చూసావా..

మతాలు ఒక్కటయ్యి..

ముస్లింలు.. క్రైస్తవులు కలిసి ప్రార్ధించడం చూసావా..

నియంతలపై విప్లవిస్తున్న చోట

నీకు శిలువలు కనబడవు..

నెలవంకలూ కనబడవు..

పూజారులు.. షేకుల నాటకీయ కౌగిలింతలూ కనబడవు..

మాతృభూమి కోసం ఏకమౌతున్న ఆత్మలు కనబడతాయి..

సమున్నతంగా ఎగురుతున్న పతాకాలు కనబడతాయి..

ఒకే దైవం.. ఒకే రక్తం.. ఒకే అస్థత్వాన్ని నమ్మే ఇద్దరు ఈజిప్షియన్లను చూస్తావు..

తిరుగుబాటును విశ్వాసంలో భాగంగా చూస్తావు..

మతమంటే విధేయంగా ఉండడం మాత్రమే కాదని చూస్తావు..

విప్లవం ఈజిప్ట్ వాసులను వీరులుగా తీర్చిదిద్దడం చూస్తావు..

భయం.. బందిపోట్లు.. భయపడడాన్ని చూస్తావు..

సల్లీ జహ్రాన్ కలలు గన్న ఈజిప్ట్ ను చూస్తావు..



(సల్లి నిరసన తెలపడానికి తెహ్రీర్ వెళుతుండగా సైన్యం చేసిన దాడిలో తలకు గాయమై మరణించింది. ఇది కవిత కాదు. బాధతో స్రవిస్తూ గుండెను పిండేస్తున్న పదాలు. ఈ పదాలు సల్లీ జహ్రాన్ ఆత్మకోసం అర్పిస్తున్న కానుక. మా దేహాల్లో ప్రాణమున్నంత వరకూ మాకు శాంతి లేదు. విశ్రాంతి లేదు. - ఒసామా హిజ్జి..)

(స్వేచ్ఛానువాదం: శక్తి)


Friday, March 11, 2011

తప్పు ఎవరిది? ఎందుకు జరిగింది?

అనుకున్నంతా.. ఆందోళన చెందినంతా జరిగింది. నిజమే ట్యాంక్ బండ్‌పై జరిగిన ఘటనలు దురదృష్టకరం. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలు హర్షించదగినవి కావు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమానికి ఉన్న పవిత్రతను ప్రశ్నించే అవకాశం ఈ ఘటన. నలుగురిలో నవ్వుతున్న సీమాంధ్రులకు తెలంగాణ ఉద్యమంపై దూషణలు చేయడానికి తగిన ఆయుధం కల్పించిన పరిస్థితి.

కానీ.. ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర చరిత్రలో.. భారతవనిలో మునుపెన్నడూ జరగని దురదృష్టకర ఘటననా? ఈ ప్రజాస్వామ్యంలో దాడులు మునుపెన్నడూ జరగనివా? నిజంగా మిలియన్ మార్చ్‌లో ఆందోళకారులు అంతటి పాపానికి ఒడిగట్టారా? .. ఈ ప్రశ్నలు అడగడంతో నేను దాడులను సమర్థిస్తున్నానని కాదు.. ముందే ఒక అభిప్రాయంలో ఉన్నవారికి ఎంతటి విశ్లేషణ ఇచ్చినా నిష్ప్రయోజనం కదా..

ఈ ఘటన జరగడానికి టీఆర్‌ఎస్‌లోని ఓ వర్గం మంకుతనమే కావొచ్చు. తమ మాటను లెక్కచేయకుండా మార్చ్ నిర్వహించడం.. వారి అహం దెబ్బతినొచ్చు. మేము లేకపోతే ఉద్యమం నడిపించలేరనే అభిప్రాయం కల్పించాలనుకున్నారేమో.. దాడుల పల్లవితో విమర్శలు చేస్తోన్న గద్దర్‌ను మార్చ్‌లో లాగడం ద్వారా రెండు పిట్టలు కొట్టాలనుకున్నా టీఆర్‌ఎస్‌లోని ఓ వర్గం సక్సెస్ అయిందని నా అనుమానం. ఇది నిజం కావొచ్చు.. కాకపోవచ్చు..

మొత్తం ఘటనకు దోషులు ప్రభుత్వం, రాజకీయ పార్టీలే.. ప్రజాస్వామ్యం, దారుణం అంటూ ఘోషించేవారు కాస్తా వెనుదిరిగి చూస్తే ఎంతో కొంత వాస్తవం తెలుస్తుంది. ప్రభుత్వం కాబట్టి ఏమైనా చేయొచ్చు.. ఉద్యమకారులు అలా చేయొద్దు అనుకునే ఆలోచనలో ఉన్నవారు.. కొద్దిగానైనా ప్రజాస్వామ్యం గురించి తెలుసుకుంటారు.

ఒకప్పుడు అన్నల సానూభూతి పరులనే నెపంతో ఎంతటి చిత్రహింసలకు గురిచేసేవారో.. ప్రస్తుతం తెలంగాణలో ప్రజలు పోలీసుల హింసకు బలైతున్నారు. వారి ఆంక్షలకు మనో వేదన చెందుతున్నారు. సమస్యను పరిష్కరిచాలనో, అర్థం చేసుకుందామనో అభిప్రాయం లేని ప్రభుత్వాలు పోలీసులకు అధికారాలను అప్పచెబుతాయి. విగ్రహాలపై దాడులు దారుణమంటున్న అధికార, ప్రతిపక్ష సీమాంధ్ర నేతలకు.. ఒక్కడ్ని చేసి పదిమంది పోలీసులు విద్యార్థిని చితకబాదిన సంఘటనలు వారి కళ్లకు కనపడలేదా.. వారి ఆక్రంధనలు చెవికి ఎక్కలేదా.. చరిత్ర అంటే పుస్తకాల్లో, కట్టడాలపై నిక్షిప్తం చేసుకున్న ఉదహరణలు కావు.. చరిత్ర అంటే ప్రజలే... వర్తమాన ప్రజలు ముఖ్యం కానప్పుడు.. గత చరిత్ర ఎందుకు? చరిత్రను మోసేది.. మోసుకేళ్లేది ప్రజలే... ఆ ప్రజలే ఆకాంక్షల ముందు.. చరిత్ర ఎక్కువనుకుంటే ఆ చరిత్రను బహిష్కరించగలరు... ధ్వంసం చేయగలరు.. తెలంగాణ ఉద్యమానికి కారణాల్లో ఒకటి చరిత్ర-సంస్కృతిపై దాడులు.. తమ సంస్కృతిపై అవహేళన, చరిత్రపై విధ్వంసాన్ని జీర్ణించుకోలేక కుమిలిపోతున్న పరిస్థితి కొనసాగుతూనే ఉంది. దానిపై ఎన్నడూ మాట్లాడని వారికి ఇప్పుడు చరిత్రపై దాడులు గురించి ప్రశ్నించే అర్హత లేదని ఆక్రోశం ఇప్పుడు ఉంది. అది విగ్రహాల తప్పు కాదు. కాని విగ్రహాలకు ప్రతినిధుల తప్పే కదా.. ట్యాంక్ బండ్‌పై తమ ప్రాంత మహానుభావుల్లో కొందరివే ఉన్నాయే ప్రశ్నకు ఇప్పటికీ ప్రభుత్వం నుంచి సమాధానం లేదు, ఆ ప్రశ్నలు తిరిగి రాకుండా చర్యలు చేపట్టలేదు. ఇప్పటి ఘటన జరిగేందుకు కారణాల్లో ఇది ఒకటి కాదా?. రాజకీయ సమస్యను ప్రజల సమస్యగా మారేలా ముసుగు తన్ని పడుకున్న ప్రభుత్వాలది కాదా?. నిజానికి విగ్రహాలు ధ్వంసం చేసిన వారు.. కావాలని చేసిన దుండగులు కావొచ్చు.. ఆవేదనతో చేసిన తెలంగాణ వాదులు కావొచ్చు.. ఒకటి మాత్రం స్పష్టం... వారిని ఇందుకు పురిగొల్పిన పరిస్థితులు సృష్టించిన ప్రభుత్వాలది, విధాన నిర్ణయాలు తీసుకోలేని పార్టీల నేతలే అసలు దోషులు. విగ్రహాలపై దాడులు చేసిన వారికి త్రిపురనేని ఏ సేవ చేశాడో తెలియదు, ఎర్రాప్రగడ ఏ పర్వం రాశాడో తెలియదు, శ్రీకృష్ణదేవరాయల అష్టదిగ్గజాలెవరో తెలియదు. కానీ ప్రభుత్వాలు, పార్టీలు ఇప్పటి పరిస్థితులు ఊహించక పోవడం క్షమించరాని నేరం. అసలీ విషయాలు తెలిసీ తెలియనట్టుగా ప్రవర్తించడమే దారుణం.

తరుచూ నేతలపై దాడులు జరుగుతుండడం ప్రజల్లో ఉన్న ఆగ్రహవేశాలేనని నిజం తెలసుకున్న ప్రజా ప్రతినిధులు ఆ దాడులు మరో ప్రాంతంపై జరగకుండా నివారించే ఆలోచనలు చేయగలుగుతున్నారా? తాము ఎన్నుకున్న నేతలు తమ అభిప్రాయలకనుగుణంగా లేకపోవడం దాడులకు పురిగొల్పేలా చేస్తున్నాయి.

మీడియాపై దాడి... అప్రజాస్వామికం, విద్రోహం అనే వారు.. అదే మీడియాపై ప్రభుత్వం దాడులు చేస్తే ఏం చేశారు? అ సంఘాలు ఏం చేశాయి? గిరిగీసుకుని వార్తలు ప్రసారం చేస్తున్న సంస్థలకు నైతికత గురించి అర్హత ఉందా? పైకి మంచి ముసుగు వేసుకుని వెనకాల రాజకీయ నేతలతో ములఖత్ అవుతోన్న మీడియాకు.. ఆనేతలకు తేడా ఏముంది? తమ అభిప్రాయాలు, ఆక్రంధనలు ప్రసారం చేయలేని మీడియా ఆగ్రహాలను మాత్రమే చూపించడంపై ఆందోళనకారులు తమ ప్రతాపం చూపారు. పరికరాలు పోయాయని పెడబొబ్బలు పెట్టడం.. గొరంతను కొండంత చేస్తున్న మీడియాకు అలాంటి పరికరాలు పొందడం పెద్ద సమస్యా?. మీడియా నిష్పక్షపాతంగా లేకపోవడమే వారికి కష్టాలు తెచ్చిపెడుతోంది. మీడియాను ప్రజలు ఎంతో కొంత ఆదరిస్తున్నారంటే.. మీడియా వల్లే తమకేదో ఇంకా మంచి జరుగుందనే.. కానీ ఆ మంచి జరగదని తెలిస్తే మీడియాకు ఆ విలువ ఉండదు.. వారిపై ఇలాంటి దాడులు ఆగవు. అందుకు తప్పు పట్టాల్సింది ఎవరిని?

ఎన్నైనా చెప్పు చేసింది తప్పు కాదా.. అంటే తప్పు కాదని ఎవరూ అనరు. కానీ అందుకు దారి తీయాల్సిన పరిస్థితులు విశ్లేషించి అసలు దోషులకు శిక్షపడాలి. అలా జరగడం లేదు.. ఇదే విచారకరం.. ప్రభుత్వం పంతానికి పోకుండా పరీక్షను వాయిదా వేసినా.. మార్చ్‌కు అనుమతిచ్చినా.. అడుగడుగునా ఆంక్షలు, అక్రమ కేసులు పెట్టకపోయినా.. నేతలను అరెస్ట్ చేసిఉండకపోయినా దాడుల తీవ్రత తగ్గిఉండేది. ఇలాంటి పరిస్థితులు రాకుండా చేయగలిగేది, వస్తే పరిష్కరించగలిగేవి ప్రభుత్వాలు, ప్రతిపక్షాలే.. కాని దురదృష్టమేమిటంటే ఇక్కడ సమస్యలకు అసలు కారకులు వారే.. ఇక దోషులు ఎవరు.. నిందితులు ఎవరు.. శిక్షించేదెవరు.. తప్పును ప్రశ్నించేదెవరు...

సంపత్