ఆకుచాటు తడిసిన పిందెలా.. ఆరేసుకోబోయి పారేసుకున్న జరీ చీర జిలుగులా.. రవివర్మకు అందని అందాల్ని అందించిన భావకుడిలా.. పదాల్నితాకి కవితా గౌతమిని ప్రవహింప చేసిన భగీరధుడిలా.. చల్లగాలిలా.. మల్లెపూవులా.. ఒక చిన్న మాటతో అనంత రాగాల్ని పలికించిన వీణలా.. కొమ్మకొమ్మకో సన్నాయిలా.. ఝమ్మన్న నాదంలా.. .. వేణువైన భువనంలా.. గాలిలో కలసిన గగనంలా.. తెలుగు అలంకారాలతో చెడుగుడు ఆడుకున్న మరపు రాని రచయిత వేటూరి.
సింధూర వర్ణాలు తెల్లారి చల్లారిపోగా
తిరిగే భూమాతవు నీవై…వేకువలో వెన్నెలవై
కరిగే కర్పూరము నీవై…ఆశలకే హారతివై
వాలిపోయే పొద్దా నీకు వర్ణాలెందుకే
లోకమెన్నడో చీకటాయెలే.. అంటూ అద్భతమైన తన కవనంతో
శ్రీశ్రీ తర్వాత తెలుగు సినిమా పాటకి జాతీయ ఉత్తమ సినిమా పాటల రచయిత పురస్కారాన్ని అందించారు వేటూరి.
ఓ సీత కధతో సినీ ప్రస్థానం ప్రారంభించిన వేటూరి.. సంగీత దర్శకుల బాణీలకు రంగురంగుల పదాల వోణీలు కట్టారు. పాటకు పైటేసి సిగ్గుల మెగ్గని చేసారు. అడవి రాముడు, శంకరాభరణం. ఇంకా సిరిసిరిమువ్వ, సాగరసంగమం, సప్తపది, సీతాకోకచిలుక, ముద్దమందారం, సితార, అన్వేషణ, స్వాతిముత్యం... ఎన్నో సినిమాలు... అజరామరమైన గీతాలు.. ఆయన కలం నుంచి జాలువారాయి.
పండితుల్ని పామరుల్ని సరిసమానంగా అలరించిన కవి వేటూరి. ఆయనో ఆధునిక శ్రీనాధుడు. పగలంతా బాధించే దిగుల్ని.. రేయింతా వేధించే సెగల్ని వేటూరిలా చెప్పగల కవులు చాలా అరుదు.
గోదావరికి వేటూరికి ఏదో అవినాభావ సంబంధం. ఎప్పుడు వెన్నెలని.. వెన్నల్లో తడిసి ముద్దయిన గోదావరిని చూసినా ఆయన కలం ఉరకలేస్తుంది. వెన్నల్లో గోదారి అందాన్ని అంత అద్భుతంగా చెప్పిన వాడు వేటూరి.
హృదయ గాయాలకి మృదుగేయ ఔషధాలను ఆర్పించిన వాక్య వైద్యుడు – వేటూరి. ఆత్రేయలోని భావసౌందర్యాన్ని, సి.నారాయణరెడ్డిలోని భాషా పటిమను… శ్రీశ్రీ లోని సామాజిక చైతన్య స్ఫూర్తిని రంగరించి రూపుదాల్చిన మూర్తి… వేటూరి సుందరరామమూర్తి. తెలుగు పాటల పూదోటలో కొమ్మకొమ్మకో సన్నాయి పలికించి.. రాలేటి పూలతో రాగాలు పలికించిన చరితార్ధుడు వేటూరి. ప్రియా ప్రియతమా అంటూ ఎప్పుడూ గుండెల్లో ధ్వనిస్తూనే ఉంటాడు.
ఆధునిక సినీకవిత్రయం ఎవరంటే ఆత్రేయ.. శ్రీశ్రీ.. వేటూరి.. అని చెప్పుకోవచ్చు. పద లాలిత్యంలోనూ.. భావ వైవిధ్యంలోనూ.. ముగ్గుర్లో ఎన్నో పోలికలు.. సామీప్యతలూ ఉన్నాయి. ముగ్గురి అవసానదశ దాదాపు ఒకే రకంగా గడచింది.
కొమ్మలు రెమ్మలు గొంతే విప్పిన కొత్త పూల మధుమాసంలో
తుమ్మెద జన్మకు నూరేళ్ళెందుకు రోజే చాలులే
చింత పడే చిలిపి చిలకా చిత్రములే బ్రతుకు నడకా
పుట్టే ప్రతి మనిషి కనుమూసే తీరు.. అంటూ వేదాంతాన్ని ప్రేమని మానవత్వాన్ని రంగరించి రాగంలా మార్చిన వేటూరి చిరస్మరనీయుదు.
ఈ మజిలీ మూడు నాళ్ళే ఈ జీవయాత్రలోఒక పూటలొనె రాలు పూవులెన్నో అంటూ వేదాంతిలా వెళ్ళిపోయిన వేటూరి.. మనకు తన ఙ్ఞాపకాలు.. పాటలు.. మిగిల్చివెళ్ళారు. ఓ వెన్నెల్ని.. ఓ వేకువని.. ఓ వేటూరిని ఎలా మరిచిపోగలం..
(ఈ రోజు వేటూరి వర్థంతి సందర్భంగా)