అనుకున్నంతా.. ఆందోళన చెందినంతా జరిగింది. నిజమే ట్యాంక్ బండ్పై జరిగిన ఘటనలు దురదృష్టకరం. ప్రజాస్వామ్యంలో ఇలాంటి ఘటనలు హర్షించదగినవి కావు. ముఖ్యంగా తెలంగాణ ఉద్యమానికి ఉన్న పవిత్రతను ప్రశ్నించే అవకాశం ఈ ఘటన. నలుగురిలో నవ్వుతున్న సీమాంధ్రులకు తెలంగాణ ఉద్యమంపై దూషణలు చేయడానికి తగిన ఆయుధం కల్పించిన పరిస్థితి.
కానీ.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర చరిత్రలో.. భారతవనిలో మునుపెన్నడూ జరగని దురదృష్టకర ఘటననా? ఈ ప్రజాస్వామ్యంలో దాడులు మునుపెన్నడూ జరగనివా? నిజంగా మిలియన్ మార్చ్లో ఆందోళకారులు అంతటి పాపానికి ఒడిగట్టారా? .. ఈ ప్రశ్నలు అడగడంతో నేను దాడులను సమర్థిస్తున్నానని కాదు.. ముందే ఒక అభిప్రాయంలో ఉన్నవారికి ఎంతటి విశ్లేషణ ఇచ్చినా నిష్ప్రయోజనం కదా..
ఈ ఘటన జరగడానికి టీఆర్ఎస్లోని ఓ వర్గం మంకుతనమే కావొచ్చు. తమ మాటను లెక్కచేయకుండా మార్చ్ నిర్వహించడం.. వారి అహం దెబ్బతినొచ్చు. మేము లేకపోతే ఉద్యమం నడిపించలేరనే అభిప్రాయం కల్పించాలనుకున్నారేమో.. దాడుల పల్లవితో విమర్శలు చేస్తోన్న గద్దర్ను మార్చ్లో లాగడం ద్వారా రెండు పిట్టలు కొట్టాలనుకున్నా టీఆర్ఎస్లోని ఓ వర్గం సక్సెస్ అయిందని నా అనుమానం. ఇది నిజం కావొచ్చు.. కాకపోవచ్చు..
మొత్తం ఘటనకు దోషులు ప్రభుత్వం, రాజకీయ పార్టీలే.. ప్రజాస్వామ్యం, దారుణం అంటూ ఘోషించేవారు కాస్తా వెనుదిరిగి చూస్తే ఎంతో కొంత వాస్తవం తెలుస్తుంది. ప్రభుత్వం కాబట్టి ఏమైనా చేయొచ్చు.. ఉద్యమకారులు అలా చేయొద్దు అనుకునే ఆలోచనలో ఉన్నవారు.. కొద్దిగానైనా ప్రజాస్వామ్యం గురించి తెలుసుకుంటారు.
ఒకప్పుడు అన్నల సానూభూతి పరులనే నెపంతో ఎంతటి చిత్రహింసలకు గురిచేసేవారో.. ప్రస్తుతం తెలంగాణలో ప్రజలు పోలీసుల హింసకు బలైతున్నారు. వారి ఆంక్షలకు మనో వేదన చెందుతున్నారు. సమస్యను పరిష్కరిచాలనో, అర్థం చేసుకుందామనో అభిప్రాయం లేని ప్రభుత్వాలు పోలీసులకు అధికారాలను అప్పచెబుతాయి. విగ్రహాలపై దాడులు దారుణమంటున్న అధికార, ప్రతిపక్ష సీమాంధ్ర నేతలకు.. ఒక్కడ్ని చేసి పదిమంది పోలీసులు విద్యార్థిని చితకబాదిన సంఘటనలు వారి కళ్లకు కనపడలేదా.. వారి ఆక్రంధనలు చెవికి ఎక్కలేదా.. చరిత్ర అంటే పుస్తకాల్లో, కట్టడాలపై నిక్షిప్తం చేసుకున్న ఉదహరణలు కావు.. చరిత్ర అంటే ప్రజలే... వర్తమాన ప్రజలు ముఖ్యం కానప్పుడు.. గత చరిత్ర ఎందుకు? చరిత్రను మోసేది.. మోసుకేళ్లేది ప్రజలే... ఆ ప్రజలే ఆకాంక్షల ముందు.. చరిత్ర ఎక్కువనుకుంటే ఆ చరిత్రను బహిష్కరించగలరు... ధ్వంసం చేయగలరు.. తెలంగాణ ఉద్యమానికి కారణాల్లో ఒకటి చరిత్ర-సంస్కృతిపై దాడులు.. తమ సంస్కృతిపై అవహేళన, చరిత్రపై విధ్వంసాన్ని జీర్ణించుకోలేక కుమిలిపోతున్న పరిస్థితి కొనసాగుతూనే ఉంది. దానిపై ఎన్నడూ మాట్లాడని వారికి ఇప్పుడు చరిత్రపై దాడులు గురించి ప్రశ్నించే అర్హత లేదని ఆక్రోశం ఇప్పుడు ఉంది. అది విగ్రహాల తప్పు కాదు. కాని విగ్రహాలకు ప్రతినిధుల తప్పే కదా.. ట్యాంక్ బండ్పై తమ ప్రాంత మహానుభావుల్లో కొందరివే ఉన్నాయే ప్రశ్నకు ఇప్పటికీ ప్రభుత్వం నుంచి సమాధానం లేదు, ఆ ప్రశ్నలు తిరిగి రాకుండా చర్యలు చేపట్టలేదు. ఇప్పటి ఘటన జరిగేందుకు కారణాల్లో ఇది ఒకటి కాదా?. రాజకీయ సమస్యను ప్రజల సమస్యగా మారేలా ముసుగు తన్ని పడుకున్న ప్రభుత్వాలది కాదా?. నిజానికి విగ్రహాలు ధ్వంసం చేసిన వారు.. కావాలని చేసిన దుండగులు కావొచ్చు.. ఆవేదనతో చేసిన తెలంగాణ వాదులు కావొచ్చు.. ఒకటి మాత్రం స్పష్టం... వారిని ఇందుకు పురిగొల్పిన పరిస్థితులు సృష్టించిన ప్రభుత్వాలది, విధాన నిర్ణయాలు తీసుకోలేని పార్టీల నేతలే అసలు దోషులు. విగ్రహాలపై దాడులు చేసిన వారికి త్రిపురనేని ఏ సేవ చేశాడో తెలియదు, ఎర్రాప్రగడ ఏ పర్వం రాశాడో తెలియదు, శ్రీకృష్ణదేవరాయల అష్టదిగ్గజాలెవరో తెలియదు. కానీ ప్రభుత్వాలు, పార్టీలు ఇప్పటి పరిస్థితులు ఊహించక పోవడం క్షమించరాని నేరం. అసలీ విషయాలు తెలిసీ తెలియనట్టుగా ప్రవర్తించడమే దారుణం.
తరుచూ నేతలపై దాడులు జరుగుతుండడం ప్రజల్లో ఉన్న ఆగ్రహవేశాలేనని నిజం తెలసుకున్న ప్రజా ప్రతినిధులు ఆ దాడులు మరో ప్రాంతంపై జరగకుండా నివారించే ఆలోచనలు చేయగలుగుతున్నారా? తాము ఎన్నుకున్న నేతలు తమ అభిప్రాయలకనుగుణంగా లేకపోవడం దాడులకు పురిగొల్పేలా చేస్తున్నాయి.
మీడియాపై దాడి... అప్రజాస్వామికం, విద్రోహం అనే వారు.. అదే మీడియాపై ప్రభుత్వం దాడులు చేస్తే ఏం చేశారు? అ సంఘాలు ఏం చేశాయి? గిరిగీసుకుని వార్తలు ప్రసారం చేస్తున్న సంస్థలకు నైతికత గురించి అర్హత ఉందా? పైకి మంచి ముసుగు వేసుకుని వెనకాల రాజకీయ నేతలతో ములఖత్ అవుతోన్న మీడియాకు.. ఆనేతలకు తేడా ఏముంది? తమ అభిప్రాయాలు, ఆక్రంధనలు ప్రసారం చేయలేని మీడియా ఆగ్రహాలను మాత్రమే చూపించడంపై ఆందోళనకారులు తమ ప్రతాపం చూపారు. పరికరాలు పోయాయని పెడబొబ్బలు పెట్టడం.. గొరంతను కొండంత చేస్తున్న మీడియాకు అలాంటి పరికరాలు పొందడం పెద్ద సమస్యా?. మీడియా నిష్పక్షపాతంగా లేకపోవడమే వారికి కష్టాలు తెచ్చిపెడుతోంది. మీడియాను ప్రజలు ఎంతో కొంత ఆదరిస్తున్నారంటే.. మీడియా వల్లే తమకేదో ఇంకా మంచి జరుగుందనే.. కానీ ఆ మంచి జరగదని తెలిస్తే మీడియాకు ఆ విలువ ఉండదు.. వారిపై ఇలాంటి దాడులు ఆగవు. అందుకు తప్పు పట్టాల్సింది ఎవరిని?
ఎన్నైనా చెప్పు చేసింది తప్పు కాదా.. అంటే తప్పు కాదని ఎవరూ అనరు. కానీ అందుకు దారి తీయాల్సిన పరిస్థితులు విశ్లేషించి అసలు దోషులకు శిక్షపడాలి. అలా జరగడం లేదు.. ఇదే విచారకరం.. ప్రభుత్వం పంతానికి పోకుండా పరీక్షను వాయిదా వేసినా.. మార్చ్కు అనుమతిచ్చినా.. అడుగడుగునా ఆంక్షలు, అక్రమ కేసులు పెట్టకపోయినా.. నేతలను అరెస్ట్ చేసిఉండకపోయినా దాడుల తీవ్రత తగ్గిఉండేది. ఇలాంటి పరిస్థితులు రాకుండా చేయగలిగేది, వస్తే పరిష్కరించగలిగేవి ప్రభుత్వాలు, ప్రతిపక్షాలే.. కాని దురదృష్టమేమిటంటే ఇక్కడ సమస్యలకు అసలు కారకులు వారే.. ఇక దోషులు ఎవరు.. నిందితులు ఎవరు.. శిక్షించేదెవరు.. తప్పును ప్రశ్నించేదెవరు...
సంపత్