ఆయన చదివింది సినిమా. ఆయనకు తెలిసింది సినిమా. అందుకే ఆయన మూవీ మొఘల్ అయ్యారు. గిన్నిస్ బుక్లో చోటు సంపాదించారు. నటరత్న ఎన్టీఆర్ దగ్గర్నుంచి ఇప్పటి అల్లరి నరేశ్ వరకు ఎంతోమందితో సినిమాలు నిర్మించారు. మరెంతో మందిని వెండితెరకు పరిచయం చేశారు. ఆయనే శతాధిక చిత్రాల నిర్మాత డాక్టర్ డి. రామానాయుడు. ఇలా ఎన్నో కీర్తి శిఖరాలను అధిరోహించి నేటితో 75 వసంతాలు పూర్తి చేసుకుని 76వ ఏట అడుగుపెడుతున్నారు.
మూవీమెఘల్గా తెలుగు సినీ పరిశ్రమలో తిరుగులేని వ్యక్తి డాక్టర్ డి. రామానాయుడు. సినిమా ప్రపంచంలోకి వెళ్ళాలని కోరికతో స్వయంగా సినిమా నిర్మాణాన్ని చేపట్టాలని భావించారు రామనాయుడు. తొలుత కో-ప్రోడ్యూసర్గా మరోకరితో కలిసి అనురాగం అనే సినిమాను నిర్మించారు. ఇక ఆ తరువాత సొంత నిర్మాణం సురేశ్ ప్రొడక్షన్స్ సంస్థను స్థాపించి తొలి చిత్రమే ఎన్టీఆర్ హీరోగా తీశారు. రాముడు-భీముడుగా ఎన్టీఆర్ను డ్యూయల్ రోల్లో చూపించి ఫస్ట్ మూవీతోనే సూపర్ సక్సెస్ను సాధించారు. అయితే ఆ ఫస్ట్ హిట్ మూవీని రీమేక్ చేయాలన్న కోరికతో ఉన్నారు రామానాయుడు.
రాముడు భీముడు భారీ హిట్ తర్వాత వెనుతిరిగి చూసుకోలేదు రామానాయుడు. ఎన్టీఆర్తో అయన తీసిన మరో చిత్రం శ్రీకృష్ణ తులాభారం. ఈ పౌరణికం ప్రేక్షకులను బాగా అలరించింది.
పట్టుదలనే అస్త్రంగా చేసుకుని మరికొన్ని సినిమాలకు శ్రీకారం చుట్టారు రామానాయుడు. ఆ సమయం కొన్ని సినిమాలు వరుసగా ప్లాప్ అయ్యాయి. అప్పుడు సినీ పరిశ్రమలో ఎన్టీఆర్ ఆయనకు నైతిక మద్దతునిచ్చారు. ఆ డూ ఆర్ డై పొజిషన్లో రామానాయుడు తీసిన చిత్రం "ప్రేమనగర్". అక్కినేని నాగేశ్వరరావు నటించిన ఈ మూవీ రామానాయుడికి ఎంతో కీర్తి ప్రతిష్టల్నీ సంపాదించి పెట్టింది. తెలుగు సినీ చరిత్రలో ఇదొక మైలురాయిలా నిలిచిపోయింది.
ఆ తర్వాత రామానాయుడి ఖాతాలో చేరిన మరో బ్లాక్ బస్టర్ మూవీ దేవత. కె.రాఘవేంద్రరావు దర్శకత్వంలో శోభన్బాబు, మోహన్బాబు, శ్రీదేవి, జయప్రద ప్రధాన పాత్రల్లో వచ్చిన ఆ మూవీ అప్పట్లో ఫ్యామిలీ ప్రేక్షకులను బాగా అలరించింది.
ఇప్పటి వరకు రామానాయుడు నిర్మించిన సినిమాల సంఖ్య నూట పాతిక. ఇందులో 75 తెలుగు సినిమాలు, 19 హిందీ సినిమాలు, 24 తమిళ చిత్రాలు, బెంగాలీలో రెండు సినిమాలు, రెండు కన్నడ చిత్రాలు, ఓరియా, అస్సామి భాష చిత్రాలు కూడా ఉన్నాయి.
నిర్మాత సక్సెసయిన రామానాయుడు తన వారసులను వెండితెరకు పరిచయం చేశారు. తనయుడు సురేష్బాబు నిర్మాతగా, హీరోగా వెంకటేష్, రీసెంట్గా మనవడు రానా.. తమ తమ సినిమాలతో బిజీబిజీగా ఉన్నారు.
తన వారసులనే కాదు ఎంతోమందిని సిల్వర్ స్క్రీన్కు ఇంట్రడ్యూస్ చేసిన క్రెడిట్ కూడా రామానాయుడిదే. ఆరుగురు హీరోలు, 12 మంది హీరోయిన్లు, 21 మంది దర్శకులను, 7 గురు మ్యూజిక్ కంపోజర్లు... మరెంతో మంది క్యారెక్టర్ ఆర్టిస్టులను సినీ రంగానికి తీసుకొచ్చిన ఘనత రామానాయుడుది. అంతేకాదు. పాతికేళ్ళుగా తెలుగు ప్రేక్షకులను నవ్వుల సాగరంలో ముంచేస్తున్న బ్రహ్మనందాన్ని సిల్వర్ స్క్రీన్కు ఇంట్రడ్యూస్ చేసింది కూడా ఆయనే.
ఇక సినిమాలను ఏదో ఊరికే తీయడం అంటే ఆయనకు నచ్చదు. దర్శకులకు పూర్తి స్వేచ్చనిచ్చే ఆయన... నిర్మాతగా అనేక సూచనలిస్తారు. తన అభిరుచులను సినిమాల్లో ఉండేలా చూసుకుంటారు. ఒక విధంగా చెప్పాలంటే అదే ఆయన్ను విజయవంతమైన నిర్మాతగా నిలబెట్టింది. సినిమా పట్ల ఆయన తీసుకునే ప్రత్యేకమైన శ్రద్ధే సినిమా విజయానికి కారణమని ఆయన దగ్గర పనిచేసిన చాలా మంది దర్శకులు అనేక సందర్భాల్లో చెబుతుంటారు.
సినిమాలే తన ప్రపంచంగా మార్చుకున్న ఆయన ఈ రంగంలో అనేక రికార్డులు సాధించారు. అందులో చెప్పుకోవాల్సింది గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్. తెలుగు ఇండస్ట్రీలో చాలా తక్కువ మంది సాధించిన ఈ ఘనతలో రామానాయుడు ఒకరు. దేశంలో సినీప్రముఖులకు ఇచ్చే అత్యున్నత పురస్కారం దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు సాధించిన ఘనత కూడా మూవీ మెగల్ది.
ఇక వ్యక్తి గతంగానూ ఆయన చేసిన సేవలకు అనేక గౌరవాలు దక్కాయి. ఇక సినీ రంగానికే కాదు తన ఎదుగుదలకు తొడ్పడ్డ ప్రేక్షకులకు, ప్రజలకు కూడా సేవ చేస్తున్న వ్యక్తి రామానాయుడు. రాజకీయాల్లో వచ్చి సేవ చేయడంతో పాటు ట్రస్ట్ ద్వారా తన సొంత డబ్బులో అనే సేవా కార్యక్రమాలు నిర్వహించారాయన.
రామానాయుడు నాలుగు దశాబ్ధాలుగా తెలుగు సినీ పరిశ్రమను చూస్తున్నారు. తనదైన స్టైల్లో సినిమాలను చూపిస్తున్నారు. అగ్రతారలందరితో సినిమాలు తీసిన ఆయన వారి స్టార్ డమ్ను మరింతగా పెంచారు.
ఓ రాముడు భీముడు, ఓ ప్రేమ్నగర్, ఓ సొగ్గాడు ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సూపర్ హిట్ చిత్రాలు... ఇవన్నీ ఆయన సారధ్యంలోనే వచ్చాయి. ఇప్పటికీ వస్తూనే ఉన్నాయి. నాలుగు దశాబ్దలుగా సినీ వినీలాకాశంలో హీరోలకు, దర్శకులకు ధీటుగా స్టార్ ప్రొడ్యూసర్గా కొనసాగుతున్న వ్యక్తి ఒక్క రామానాయుడు మాత్రమే అని చెప్పడంలో ఏ మాత్రం సందేహం లేదు.
అయన అలుపెరగని సుదీర్ఘ బాటసారి.. ఎవ్వరు సాధించలేని ప్రపంచరికార్డులు ఒంటి చేత్తో సాధించగల నేర్పరి.. హిట్ సాధించేంతవరకు నిద్దురపోని గడుసరి.. ఆ మూవీమొఘల్కు బర్త్ డే విషెస్ అందిద్దాం.
-స్వామి ముద్దం